Pappu Charu : ప‌ప్పు చారును ఎంతో సుల‌భంగా.. ఈజీగా.. ఇలా చేయ‌వ‌చ్చు..!

Pappu Charu : మ‌నం కూర‌ల‌తో పాటు వంటింట్లో త‌ర‌చుగా ప‌ప్పు చారును కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ప‌ప్పు చారు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ప‌ప్పు చారుతో భోజ‌నం చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. అయితే ప‌ప్పు చారును వివిధ రుచుల్లో త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసిన ప‌ప్పుచారు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌ప్పు చారును త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ప‌ప్పు చారును అంద‌రికి న‌చ్చేలా రుచిగా, కమ్మ‌గా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌ప్పు చారు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన కందిపప్పు – 100 గ్రా., త‌రిగిన క్యారెట్ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, సొర‌కాయ ముక్క‌లు – అర క‌ప్పు, త‌రిగిన మున‌క్కాయ – 1, త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, త‌రిగిన ట‌మాటాలు – 2, నాన‌బెట్టిన చింత‌పండు – చిన్న నిమ్మకాయంత‌, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు – 5, ఎండుమిర్చి – 2, కారం – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు- ఒక టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు -త‌గినంత‌, ఇంగువ – చిటికెడు.

Pappu Charu very easy to make and tasty
Pappu Charu

ప‌ప్పు చారు త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ఉడికించిన కందిప‌ప్పు, లీట‌ర్ నీటిని పోసి క‌ల‌పాలి. ఇందులోనే కూర‌గాయ ముక్క‌లు, ట‌మాట ముక్క‌లు, ఉప్పు, ప‌సుపు, కారం, చింత‌పండు ర‌సం, కారం వేసి క‌ల‌పాలి. ఇప్పుడు దీనిని మ‌ధ్య‌స్థ మంట‌పై అర గంట పాటు మ‌రిగించాలి. ఇలా మ‌రిగించిన త‌రువాత క‌రివేపాకు వేసి మ‌రో రెండు నిమిషాల పాటుమ‌రిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత మ‌రో క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, వెల్లుల్లి రెబ్బ‌లు, క‌రివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి.

తాళింపు వేగిన త‌రువాత ఇంగువ వేసి క‌ల‌పాలి. తాళింపు వేగిన త‌రువాత మ‌రిగించిన ప‌ప్పుచారును వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు మ‌రిగించిన త‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌ప్పు చారు త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన ప‌ప్పు చారును లొట్ట లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts