Ceramic Cups : సాధారణంగా చాలా మందికి ఉదయం లేవగానే వేడి వేడి కాఫీ లేదా టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. ఉదయం నిద్ర లేస్తూనే కొందరు బెడ్ టీ లేదా కాఫీ తాగుతారు. అయితే చాలా మంది ఎంతో అందంగా తయారు చేసిన సెరామిక్ కప్పులలో కాఫీ, టీలను తాగుతుంటారు. కానీ అలాంటి కప్పులలో మీరు కాఫీ తాగుతున్నట్లయితే మీరు అనారోగ్యాల బారిన పడినట్లేనని నిపుణులు తెలియజేస్తున్నారు. అస్సాం యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.
మార్కెట్లో మనకు అనేక రకాల రంగులతో తీర్చిదిద్దబడిన పింగాణీ కప్పులు కనిపిస్తాయి. దీంతో వాటిని కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటాం. పింగాణీ పాత్రలతోపాటు కప్పులను కూడా ఉపయోగిస్తుంటాం. వాటిలో టీ, కాఫీ లేదా పాలను పోసి తాగుతుంటాం. అయితే పింగాణీ పాత్రల వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
పింగాణీ పాత్రలు లేదా కప్పుల్లో వేడి ద్రవాలను పోసినప్పుడు వాటిల్లో ఉండే తగరం, సీసం ఆ ద్రవాల్లో కరుగుతాయి. దీంతో అవి మన ఆరోగ్యానికి హాని కలగజేస్తాయి. అవి ఎంతో ప్రమాదకరమని నిపుణులు తెలియజేస్తున్నారు.
సిరామిక్ పాత్రల తయారీలో భాగంగా సీసం, తగరం ఉపయోగిస్తుంటారు. దీని వల్ల అవి కరిగి మనం తినే ఆహారాలు, తాగే ద్రవాల్లో చేరి ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయని నిపుణులు చెబున్నారు. ఇలా కప్పులలో పాలు లేదా కాఫీ, టీ లను తాగడం వల్ల పిల్లలు, బాలింతలు, గర్భిణీలు అధికంగా అనారోగ్యాల బారిన పడుతున్నారని, పిల్లలలో జ్ఞాపకశక్తి తగ్గుతుందని ఈ సందర్భంగా నిపుణులు తెలియజేశారు.
కాగా సైంటిస్టులు చేపట్టిన ఈ అధ్యయనం తాలూకు వివరాలను ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ పొల్యూషన్ రీసెర్చ్ అనే జర్నల్లో ప్రచురించారు. అయితే పింగాణీ పాత్రలు లేదా కప్పులన్నీ హానికరం కావు. కనుక వాటిని కొనే ముందు పరిశీలించడం మంచిది. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన కప్పులను వాడితే ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని చెబుతున్నారు. లేదంటే నాసిరకం పింగాణీ కప్పుల్లో సీసం మోతాదుకు మించి ఉంటుందని, దాంతో హాని కలుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.