ఆధ్యాత్మికం

దేవాల‌యంలో ఏం చేయాలో.. ఏం చేయ‌కూడ‌దో తెలుసా..?

దేవాలయానికి సాధ్యమైనంత వరకు ఒట్టి చేతులతో వెళ్లకూడదు. సాక్షాత్తు మనల్ని ప్రతిక్షణం నడిపిస్తున్న తండ్రి, త‌ల్లిగా భావించి వారికి శక్తిమేరకు ఏదో ఒకటి తీసుకునిపోవాలి. ఇంట్లోపూసిన పూలు, మారేడు దళాలు, పూలమాలలు, పండ్లు, ప్రసాదం ఇలా ఏది అవకాశం ఉంటే దాన్ని తప్పక తీసుకుని పోవాలి. దేవాలయానికి పోయిన వెంటనే అవకాశం ఉంటే కాళ్లు, చేతులూ కడుగుకోవాలి. వెంటనే ధ్వజస్తంభం వద్దకు వెళ్లి స్వామి/అమ్మవారిని మనస్సులో స్మరించుకుని అవకాశాన్ని బట్టి ప్రదక్షిణలు కనీసం మూడు తప్పనిసరి. చేయాలి. తర్వాత దేవాలయంలోని గర్భగుడి ముందు ఎదురుగా కాకుండా పక్కకు నిలబడి దేవతామూర్తిని దర్శనం చేసుకోవాలి. వీలైతే మగవారు సాష్టాంగం, ఆడవారు అర్ధసాష్టాంగ నమస్కారం చేసుకోవాలి.

అనంతరం తీర్థాన్ని, శఠగోపరాన్ని తీసుకోవాలి. అక్కడక్కడి పరిస్థితులను బట్టి ఒక్కసారి లేదా మూడుసార్లు తీర్థం ఇస్తారు. ఒకవేళ మూడు సార్లు ఇస్తే విడివిడిగా తీసుకోవాలి. తీర్థం తీసుకుని లోపలికి స్వీకరించే సమయంలో చప్పుడు రాకుండా తీసుకోవాలి. శివునికి అభిషేకం, సూర్యునికి నమస్కారం, విష్ణువుకి అలంకారం, వినాయకునికి తర్పణం,అమ్మవారికి కుంకుమ పూజ ఇష్టం. వాటిని చేస్తే మంచి జరుగుతుంది. దైవప్రసాదాన్ని తినాలి కాని పారవేయరాదు. శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యలో మనుష్యులు నడవరాదు. అదేవిధంగా ఆయా దేవాలయాల్లో మూలవిరాట్టులకు వారి వారి వాహనాలకు మధ్య నడువరాదు.

what to do in temple

దేవాలయంలో దర్శనం పూర్తయిన తర్వాత ఆవరణలో ఒక్కనిమిషమైనా కూర్చుని భగవంతుని ధ్యానం చేసుకుని వస్తే మంచిది. దేవాలయంలో ఎట్టిపరిస్థితుల్లో గట్టిగా మాట్లాడవద్దు, సెల్‌ఫొన్‌లు తీసుకపోవద్దు. దేవాలయంలో అనవసర విషయాలు, మాటలు మాట్లాడకండి, ఎక్కువ భగవంతుని మనస్సులో స్మరిస్తూ కాలాన్ని గడపాలి. క్యూలైన్లలో తప్పక నిదానంగా, పక్కవారికి ఇబ్బంది కల‌గకుండా పోవాలి. డాంబికాలు, అధికార ప్రదర్శనలు, ఆర్థిక ప్రదర్శనలు చేస్తే వాటివల్ల తప్పక చెడు జరుగుతుంది. దేవుని దగ్గర అందరూ సమానమనే వేదోక్తిని గుర్తుంచుకుని పోండి. పెద్దలకు, పిల్లలను, వికలాంగులకు సహాయపడండి, వారిని గౌరవించండి.

లైన్లలో తోసుకుని పోవడం, వేగంగా పోతూ ఇతరులను డాష్ ఇవ్వడం చేయకండి. ప్రదక్షిణ నియమావళిని పాటిస్తే తప్పక మంచి జరుగుతుంది. గట్టిగా స్తోత్రాలు, పాటలు పాడకండి, ఇతరుల ధ్యానాన్ని భంగ పర్చకండి. బయటకు వచ్చిన తర్వాత శక్తిమేరకు దానం, ధర్మం చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్లు కడుగవద్దు. ప్రసాదాన్ని అందరూ భక్తి, వినమ్రతలతో స్వీకరించండి. ఈ కనీస నియమాలు పాటిస్తే తప్పక మంచి జరుగుతుంది.

Admin