శివుడు అభిషేక ప్రియుడు. విష్ణువు అలంకార ప్రియుడు. కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. ఈ మాసంలో శివాభిషేకాలు చాలా ప్రత్యేకం అయితే కామ్యాలు నెరవేరడానికి ఒక్కో ద్రవ్యంతో చేసే అభిషేకం ఒక్కో ఫలితాన్ని ఇస్తాయి. ఏ ద్రవ్యంతో ఏ ఫలితం వస్తుందో శాస్త్రవచనాలను పరిశీలిద్దాం. కేవలం కార్తీక మాసంలోనే కాదు, ఏ సమయంలో అయినా సరే శివుడికి చేసే అభిషేకాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది.
ఆవునెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆవుపాలతో అభిషేకిస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. శుద్ధమైన నీటితో అభిషేకం చేస్తే నష్ట ద్రవ్య ప్రాప్తి కలుగుతుంది. భస్మంతో అభిషేకం చేస్తే మహా పాపాలు అయినా సరే నశించిపోతాయి. గంధోదకంతో అభిషేకం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. సౌఖ్యం లభిస్తుంది. సువర్ఱోదకంతో అభిషేకం చేస్తే దారిద్ర్యం ఉండదు. తేనెతో అభిషేకిస్తే తేజస్సు, యశస్సు కలుగుతాయి. కొబ్బరి నీళ్లతో అభిషేకిస్తే సకల సంపదలు కలుగుతాయి.
పుష్పాలతో అభిషేకం భూలాభం ఇస్తుంది. చక్కరతో దుఖఃనాశనం అవుతుంది. మారేడు బిల్వాలతో అభిషేకం చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి. చెరుకు రసంతో ధనవృద్ధి, నువ్వుల నూనెతో అపమృత్యుదోష నివారణ, శనిశాంతి, అన్నాభిషేకం చేస్తే అధికారప్రాప్తి, పసుపు, కుంకుమలతో అభిషేకం చేస్తే శుభాలు కలుగుతాయి.
అయితే పై ద్రవ్యాలతో అభిషేకం చేసిన తప్పక ఆయా ఫలితాలు కలుగుతాయి. కానీ చేసే పూజలో భక్తి, శ్రద్ధ, విశ్వాసం అత్యంత అవసరమని శాస్ర్తాలు పేర్కొన్నాయి. చిత్తశుద్ధిలేని శివుని పూజలేల. అన్న చందాన కాకుండా చిత్తశుద్ధితో హరహరా అని శుద్ధ జలంతో అభిషేకించి, చిటికెడు బూడిదను శ్రద్ధతో సమర్పించి, మారేడు దళాన్ని భక్తితో భోళాశంకరుడిపై వేస్తే చాలు ఐశ్వర్యం, ఆరోగ్యం తప్పక మీ సొంతం అవుతుంది. సర్వైశ్వర్య, ఆరోగ్యకారకుడే కాకుండా చెడునంతా లయం చేయగలిగిన లయకారకుడు ఆ ఆది భిక్షువు సర్వమంగళకారకుడు శంకరుడు. సదా శివోహం శివోహం.