హిందువుల్లో చాలా మంది వారంలో నిర్దిష్టమైన రోజుల్లో మాంసాహారం తినరు. కొందరు సోమవారం మాంసాహారం తినడం మానేస్తే, కొందరు మంగళవారం తినరు. కొందరు గురువారం, ఇంకా కొందరు శనివారం మాంసాహారం తినరు. తాము ఆ రోజున తమ ఇష్టదైవానికి మొక్కుకున్నామని, కనుకనే ఆయా రోజుల్లో మాంసాహారం తినలేమని కొందరు చెబుతారు. అయితే నిజానికి ఈ రోజుల్లో అసలు మాంసాహారం ఎందుకు తినకూడదో తెలుసా..? అందుకు ఉన్న పలు కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వారంలో ఉన్న 7 రోజుల్లో ఒక్కో రోజున ఒక్కో దైవాన్ని హిందువులు పూజిస్తారు. ఆ లెక్కన చూసుకుంటే ఆదివారం రామున్ని, సోమవారం శివుడు, గణేషున్ని, మంగళవారం హనుమంతున్ని, దుర్గాదేవిని, బుధవారం విష్ణువు, అయ్యప్ప స్వామిని, గురువారం సాయిబాబా, విష్ణువును, శుక్రవారం మహాలక్ష్మి, పార్వతి, దుర్గా దేవిని, శనివారం వెంకటేశ్వర స్వామి, హనుమంతున్ని భక్తులు పూజిస్తారు. అయితే వారంలో సోమ, మంగళ, గురు, శని వారాల్లో మాత్రం చాలా మంది నాన్ వెజ్ తినరు. ఇలా ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకప్పుడు బ్రాహ్మణులంతా కలసి ఓ నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే.. జనాలు ఎక్కువగా మాంసాహారానికి అలవాటు పడిపోయారని, అది హానికరమని భావిస్తూ అందరూ కచ్చితంగా శాకాహారం మాత్రమే తినాలని తీర్మానించారు. కానీ దీనికి చాలా మంది ఒప్పుకోలేదట. అయితే కనీసం సోమ, మంగళ, గురు, శని వారాల్లో అయినా మాంసాహారం మానేయమని, అలా చేస్తే ఆ రోజుల్లో పూజించే దైవాల అనుగ్రహం లభిస్తుందని చెప్పారు. దీంతో ఆ రోజుల్లో నాన్వెజ్ తినడం మానేశారు జనాలు. ఇక దీనికి ఉన్న ఇంకో కారణం ఏమిటంటే…
మాంసాహారం తామస ఆహారం. అంటే ఒంట్లో కామాన్ని, కోరికలను పెంచుతుంది. దీంతో మనుషులు వాటి బారిన పడి ఉచ్చ నీచాలను మరిచిపోతారు. చేయకూడని పనులు చేస్తారు. వ్యక్తిగత నియంత్రణ ఉండదు. దీంతో ఇలా జరగకుండా ఉండేందుకు, సెల్ఫ్ కంట్రోల్ కోసం జనాలు ఆయా రోజుల్లో నాన్ వెజ్ తినడం మానేశారు. నాన్ వెజ్ తినరు కాబట్టి దైవాన్ని పూజిస్తే అనుగ్రహం కలుగుతుందని నమ్మారు. కనుకనే ఆ రోజుల్లో చాలా మంది నాన్ వెజ్ను తినడం మానేశారు. అదేవిధంగా ఈ అంశం వెనుక ఉన్న మరో కారణాన్ని పరిశీలిస్తే… అప్పట్లో పురాణాల ప్రకారం దేవతలు తమకిష్టమైన దేవుళ్లు, దేవతలను అడిగారట. వారికిష్టమైన రోజు వారంలో ఏది అని. దీంతో దేవుళ్లు, దేవతలు తమ కిష్టమైన రోజులుగా పైన చెప్పిన ఆ రోజులను చెప్పారట. దీంతో అప్పటి నుంచి ఆ రోజుల్లో మాత్రం మాంసాహారం తినడం మానేసి దైవ పూజ చేస్తూ వస్తున్నారు.