పల్లీలను బటర్లో, మొలకల్లో వాడుకోవడం అందరికీ తెలుసు.. కానీ వీటితో రైస్ ఎప్పుడైనా చేశారా.. మనం టమోటా రైస్, కొత్తమీర రైస్, పాలక్ రైస్ ఇలా చేసుకుని తిని ఉంటాం కానీ..పీనట్ రైస్ వీటన్నింటిని మించి టేస్ట్ ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పీనట్ రైస్ ఎలా చేయాలో నేర్చుకోండి మరీ..!
పీనట్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..
బాస్మతి బియ్యం ఒక కప్పు, కొబ్బరిపాలు ఒక కప్పు, వేరుశనగపప్పులు ఒక కప్పు, కొబ్బరి తురుము అరకప్పు, వేయించిన నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, అల్లంముక్కలు ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్, మీగడ ఒక టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు నాలుగు, కరివేపాకు కొద్దిగా.
తయారు చేసే విధానం..
ముందుగా ఒక పాత్ర పెట్టి అందులో బాస్మతి రైస్ కడిగి నీళ్లు తీసేసి వేయండి. ఒక కప్పు కొబ్బరిపాలు, ఒక కప్పు నీళ్లు పోసి ఉడికించుకోండి. పొడిపొడిలా ఉండే విధంగా చేసుకుని పక్కనపెట్టుకోండి. పొయ్యిమీద ఇంకో నాన్స్టిక్ పాత్ర పెట్టి అందులో జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు వేసి వేడెక్కనివ్వండి. వేరుశనగపప్పులు తీసుకుని దోరగా వేయించండి. వాటిని మిక్సీజార్లో వేయండి. అందులోనే పచ్చికొబ్బరి వేసి ముక్క చెక్కలలా పొడి చేసుకోండి. ఇప్పుడు పొయ్యిమీద ఒక పాత్ర పెట్టుకుని అందులో ఆవాలు, అల్లంముక్కలు, జీలకర్ర, ఇంగువపొడి, కరివేపాకు, వేరుశనగపప్పులు, మీగడ వేసి వేగనివ్వండి, తాలింపు దోరగా వేగిన తర్వాత వేయించిన నువ్వులు కొద్దిగా వేసి ఇంతకుముందు చేసుకున్న పొడికూడా వేయండి. కలిపి ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్కూడా వేసి బాగా కలుపుకోండి. పైన కొద్దిగా నిమ్మరసం వేసి కలుపుకోండి. కొబ్బరి తురుము, కొత్తిమీరతో డ్రసింగ్ చేసుకుని తీసుకుంటే సరీ..! ఎంతో రుచిగా, ఆరోగ్యంగా ఉండే పీనట్ రైస్ తయార్.! ఎదిగే పిల్లలకు ఇలాంటివి చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇంకా వారి బలానికి కూడా చాలా మంచిది.