Ashwagandha : అశ్వగంధకు ఆయుర్వేదంలో ఎంతగానో ప్రాధాన్యత ఉంది. అనేక వ్యాధులను తగ్గించేందుకు అశ్వగంధను ఉపయోగిస్తారు. అనేక ఔషధాల తయారీలోనూ దీన్ని వాడుతారు. అశ్వగంధను రోజూ తీసుకోవడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు.
అశ్వగంధనే ఇండియన్ వింటర్ చెర్రీ లేదా ఇండియన్ జిన్సెంగ్ అని పిలుస్తారు. ఇది మనకు బయట మార్కెట్లో పొడి లేదా ట్యాబ్లెట్ల రూపంలో లభిస్తుంది. కరోనా నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచే మూలికగా అశ్వగంధకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. అయితే అశ్వగంధను ఏ సమయంలో తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోరాదు.. అనే విషయాలను ఆయుర్వేదం తెలియజేస్తోంది.
ఆయుర్వేద వైద్యులు చెబుతున్న ప్రకారం.. జ్వరం ఉన్నప్పుడు అశ్వగంధను తీసుకోరాదు. అశ్వగంధలో అనేక బయోయాక్టివ్ కెమికల్స్ ఉంటాయి. అవి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లామేటరీ, ఇమ్యునో మాడ్యులేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. అందువల్ల బాక్టీరియా, వైరస్ లు కలగజేసే దగ్గు, జలుబు, ఫ్లూ వంటి వ్యాధులను తగ్గించేందుకు అశ్వగంధ పనికొస్తుంది.
అయితే జ్వరం బాగా ఉన్నవారికి సహజంగానే ఆహారాలు సరిగ్గా జీర్ణం కావు. అశ్వగంధ జీర్ణం అయ్యేందుకు జీర్ణవ్యవస్థ చాలా కష్ట పడాల్సి ఉంటుంది. కనుక జ్వరం బాగా ఉన్నవారు దీన్ని తీసుకోకపోవడమే మంచిది. లేదంటే విరేచనాల వంటి సమస్యలు వస్తాయి.
ఇక అశ్వగంధను అధిక మోతాదులో తీసుకుంటే తీవ్రమైన దుష్పరిణామాలు కలుగుతాయి. అశ్వగంధను వైద్య నిపుణులు తెలిపిన లేదా ప్యాక్పై సూచించిన విధంగా వాడాల్సి ఉంటుంది. మోతాదుకు మించితే అనారోగ్య సమస్యలు సంభవిస్తాయి. ముఖ్యంగా జీర్ణాశయంలో అసౌకర్యం, విరేచనాలు, వాంతికి వచ్చినట్లు ఉండడం.. వంటి సమస్యలు వస్తాయి. కనుక అశ్వగంధను మోతాదులో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
అధిక మోతాదులో అశ్వగంధను తీసుకుంటే లివర్ సమస్యలు కూడా వస్తాయి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు అశ్వగంధను డాక్టర్ సూచన మేరకు తీసుకోవచ్చు. అశ్వగంధను రోజుకు 125 మిల్లీగ్రాముల నుంచి 5 గ్రాముల మోతాదులో తీసుకోవచ్చు. రోజుకు 2 నుంచి 4 సార్లు డోసుల్లో దీన్ని తీసుకోవాలి. అశ్వగంధకు చెందిన ట్యాబ్లెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉదయం, సాయంత్రం ఒకటి చొప్పున 250 మిల్లీగ్రాముల మోతాదులో తీసుకోవచ్చు. రోజుకు గరిష్టంగా 1 గ్రాము చొప్పున ట్యాబ్లెట్లను వేసుకోవచ్చు.
అశ్వగంధను ఉదయం లేదా సాయంత్రం లేదా రెండు పూటలా తీసుకోవచచ్చు. అయితే దీన్ని పరగడుపున మాత్రం తీసుకోరాదు. తీసుకుంటే కడుపులో అసౌకర్యం కలుగుతుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేశాక.. లేదా కొంచెం ఏదైనా తిన్నాక మాత్రమే అశ్వగంధను తీసుకోవాలి. రాత్రి పూట కూడా ఆహారం తీసుకున్నాకే అశ్వగంధను వేసుకోవాలి. దీంతో నిద్ర బాగా వస్తుంది. ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి.