గాలి కాలుష్యం నుంచి తప్పించుకునేందుకు 11 ఆయుర్వేద చిట్కాలు..!

గాలి కాలుష్యం అనేది ప్రస్తుతం ఏటా ఎలా పెరిగిపోతుందో అందరికీ తెలిసిందే. కాలుష్యం బారిన పడి అనేక మందికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తున్నాయి. నేడు ఎక్కడ చూసినా.. ఏ ప్రాంతంలోనైనా సరే గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో నిత్యం ఆ కాలుష్యంలో తిరగక తప్పడం లేదు. అయితే కింద తెలిపిన పలు ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే గాలి కాలుష్యం నుంచి సురక్షితంగా ఉండవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది. అందుకు ఏం చేయాలంటే…

ayurvedic tips to be safe from air pollution

1. వేపాకులు

వేపాకులను కొన్నింటిని తీసుకుని నీటిలో వేసి బాగా మరిగించాలి. స్నానం చేసేటప్పుడు ముందుగా చర్మాన్ని, వెంట్రుకలను ఆ నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో చర్మం, వెంట్రుకలు శుభ్రంగా మారుతాయి. చర్మం, వెంట్రులకు పట్టుకుని ఉండే కాలుష్య కారకాలు తొలగిపోతాయి. అలాగే నిత్యం 3 లేదా 4 వేపాకులను ఉదయాన్నే పరగడుపునే తింటే శ్వాసకోశ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది. అలాగే రక్తం శుద్ధి అవుతుంది.

2. తులసి

కాలుష్యాన్ని శోషించుకోవడంలో తులసి మొక్కలు అద్భుతంగా పనిచేస్తాయి. నిత్యం 10 నుంచి 15 ఎంఎల్‌ మోతాదులో తులసి ఆకుల రసాన్ని తీసుకోవాలి. దీంతో శ్వాసకోశ వ్యవస్థ శుభ్రమవుతుంది.

3. పసుపు

అర టీస్పూన్‌ పసుపు, ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె లేదా నెయ్యిలను కలిపి ఆ మిశ్రమాన్ని నిత్యం ఉదయాన్నే పరగడుపునే తినాలి. ఇలా చేసినా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

4. నెయ్యి

రోజూ ఉదయం, రాత్రి పడుకునే ముందు ముక్కు రంధ్రాల్లో 2 చుక్కల చొప్పున ఆవు నెయ్యి వేయాలి. దీంతో నాసికా రంధ్రాలు శుభ్రమవుతాయి. కాలుష్యకారకాలు ఉండవు. అలాగే నిత్యం రెండు లేదా మూడు టీస్పూన్ల నెయ్యిని తినాలి. ఇలా చేయడం వల్ల ఎముకలు, కిడ్నీలు, లివర్‌లలో పేరుకుపోయే సీసం, పాదరసం వంటి లోహాలు బయటకు వెళ్లిపోతాయి. ఆయా భాగాలకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు సంభవించకుండా ఉంటాయి.

5. పిప్పళ్లు

ఊపిరితిత్తులను శుభ్ర పరచడంలో పిప్పళ్లు అమోఘంగా పనిచేస్తాయి. శ్వాస సరిగ్గా ఆడేలా చేస్తాయి. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అందుకు గాను పావు టీస్పూన్‌ అల్లం రసం, పావు టీస్పూన్‌ పసుపు, 1/8 వ వంతు పిప్పళ్ల చూర్ణం, ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెలను ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో కలిపి వరుసగా 7 రోజుల పాటు నిత్యం తీసుకోవాలి. దీంతో ముందు తెలిపిన సమస్యల నుంచి బయట పడవచ్చు.

6. త్రిఫల

త్రిఫల చూర్ణం కాలుష్యం బారి నుంచి మనల్ని రక్షిస్తుంది. శరీరంలోని మూడు దోషాలను సమతుల్యం చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నిత్యం రాత్రి పడుకునే ముందు ఒక టేబుల్‌ స్పూన్‌ త్రిఫల చూర్ణం, ఒక టీస్పూన్‌ తేనెలను బాగా కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ శుభ్రపడుతుంది.

7. దానిమ్మ పండు

నిత్యం దానిమ్మ పండ్ల జ్యూస్‌ను తాగితే రక్తం శుద్ధి అవుతుంది. గుండె ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. అలాగే శ్వాసకోశ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. కాలుష్యం వల్ల దుష్ప్రభావాలు కలగకుండా ఉంటాయి.

8. ఆవిరి

ఒక పాత్రలో వేడి నీటిని తీసుకుని ఆవిరి వస్తుండగానే అందులో 5 నుంచి 10 చుక్కల యూకలిప్టస్‌ ఆయిల్‌ లేదా పెప్పర్‌మింట్‌ ఆయిల్‌ను వేయాలి. తరువాత ఆ నీటి నుంచి వచ్చే ఆవిని 5 నిమిషాల పాటు పీల్చాలి. ఇలా రోజూ ఉదయం, సాయంత్రం చేయాలి. దీంతో శ్వాసకోశ వ్యవస్థ శుభ్రమవుతుంది. శ్వా్స సరిగ్గా ఆడుతుంది.

9. ధూపం

గుగ్గుళ్లు, అగురు లతో తయారు చేసిన ధూపం పొగను ఇంట్లో వేయాలి. దీంతో ఇండ్లలో ఏర్పడే కాలుష్య కారకాలు నాశనమవుతాయి. ఇంట్లో అతిగా ఉండే తేమ పోతుంది. సాధారణంగా చాలా మందికి ఇండ్లలో ఉండే కాలుష్య కారకాల వల్లే తరచూ జలుబు, దగ్గు వస్తుంటాయి. వాటిని నివారించేందుకు ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది.

10. మూలికలు

పసుపు, పచ్చి మిర్చి, వాము, అల్లం రసంలను నిత్యం తీసుకుంటే శ్వాస కోశ సమస్యలు రాకుండా ఉంటాయి.

11. ప్రాణాయామం

గాలి కాలుష్యం వల్ల ఏర్పడే దుష్ప్రభావాలను తొలగించుకోవాలంటే నిత్యం ప్రాణాయామం, కపాలభాతి, జలనేతి వంటి పద్ధతులను సాధన చేయాలి. వీటి వల్ల శ్వాసకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అందులో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. శ్వాస సమస్యలు ఉండవు.

Share
Admin

Recent Posts