వయసు పైబడుతున్న కొద్ది పేగులలో చురుకుదనం నశిస్తుంది. పేగులు బాగా మందగించి సాధారణంగా ప్రతిరోజూ అయ్యే విరోచనం సాఫీగా కాక ఇబ్బందిపెడుతుంది. దీనికితోడు జీర్ణశక్తి కూడా తగ్గుతుంది. ఈ సమస్య ప్రతికాలంలో మరింత అధికంగా వుంటుంది. తినే ఆహారంలో సరైన పీచు పదార్ధాలుండకపోవటంతో ఈ సమస్య మరింత జటిలం అవుతుంది. శరీరంలోని మలినాలు బయటకు పోవటానికి ప్రతిరోజూ సాఫీగా విరోచనం, మూత్రం, అపానవాయువులు అయిపోతూ వుండాలి. ఇవి సరిగా బయటకు పోని పక్షంలో మలబద్ధకం ఏర్పడుతుంది.
మనం తినే ఆహారంలో కూడా కొన్ని ఆహారాలు మలబద్ధకాన్ని పెంచేవిగా కూడా వుంటాయి. జీర్ణక్రియ మెరుగుపడాలన్నా, మలబద్ధకాన్ని పోగొట్టాలన్నా కల్తీలేని ఆముదాన్నిగోరు వెచ్చగా వేడి చేసి తగిన మోతాదులో తీసుకుంటే, మలబద్ధకం పోయి విరోచనం సాఫీగా అవుతుంది. మరో చర్యగా సునాముఖి ఆకు పచారీ షాపుల్లో దొరకుతుంది. దీనిని తెచ్చి బాగా శుభ్రం చేసి, మెత్తగా దంచిన పొడిని ఒకటి లేదా రెండు చెంచాల మోతాదు వరకు నేరుగా తింటే కూడా మలబద్ధక నివారణకు మంచి ఔషధంగా పనిచేస్తుంది.
ఎంత మోతాదు వేసుకొంటే విరేచనం ఫ్రీగా అవుతుందో తెలుసుకొని తగుమాత్రం వేసుకోవాలి. వీటి డోసేజి పిల్లలకు, పెద్దలకు వేరువేరుగా వుంటుంది. సునాముఖి ఆకు పొడిని మజ్జిగాలో కూడా కలిపి తాగవచ్చు. లేదా ధనియాలపొడితో కలిపి అన్నంలో కూడా తినవచ్చు. ఉదయంవేళ మజ్జిగ తేట రెగ్యులర్ గా తాగుతూ వుంటూ, పేగులు సడలి సుఖవిరోచనం అయ్యే అవకాశం కూడా వుంది. కాఫీలు, టీలు తాగే అలవాటువున్నవారు అవి మానేయాలి. కాఫీలు, టీ లు మలబద్ధకతను పెంచుతాయి.