అవసరాలు, కోరికలు చాలా ఉండవచ్చు కానీ ఆర్థిక కేటాయింపులకు లోబడి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు అత్యవసరమైనది ఎంచుకోకతప్పదు. అదే CDS చెప్పేది. ఆధునిక జలాంతర్గాములా లేదా మూడవ విమానవాహక నౌక కావాలో తేల్చుకోమని అడిగారు. నౌకా దళం రెండూ కావాలి అంటుంది అది సమస్య. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఆధునిక జలాంతర్గాములను తీసుకోవడమే సరైన నిర్ణయం. అదెలా? మనకి ఉన్న ప్రధాన శత్రువులు పాకిస్తాన్, చైనా. చైనా నౌకలు మనతో యుద్ధం చెయ్యాలి అన్నా, వారికి కావలసి చమురులో 80% మోసుకు వెళ్ళాలి అన్నా మలేసియా దగ్గర ఉన్న ఆ సన్నని సందులోనుంచి ప్రయాణించాలి. అండమాన్ నికోబార్ దీవులని మనం ఉపయోగించుకోవచ్చు వాళ్ళ మీద నిఘా వేయడానికి దాడి చేయడానికి. ఆ పని జలాంతర్గాములు, దీవులలో ఉన్న యుద్దావిమానాలు, P8I విమానాలు విమాన వాహక నౌకలకన్నా బాగా చేయగలవు తక్కువ ఖర్చులో.
ఇక పాకిస్తాన్ వాళ్ళకి ఉన్న ఒకే ఒక్క సవ్యమైన నావికా స్థావరం కరాచీ ( గ్వాదర్ కాకుండా), అది మనకి దగ్గరలోనే ఉంది. యుద్ధవిమానాలు, యుద్ధనౌకలు దాని సంగతి చూసుకోగలవు. మనం వాళ్ళు నీటిలో అమర్చే బాంబులను (mines) తొలగించే నౌకలు సమకూర్చుకోవాలి. ఇంకో విమాన వాహక నౌక అక్కర్లేదు. ఉన్న రెండు చాలు మన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా.
వెంట్రుక తో కొండని లాగినట్టు, పాకిస్తాన్ మన 10 బిల్లియన్ల నౌకమీద 100 మిలియన్లు ఖర్చుపెట్టి 200 నౌకా విధ్వంసక క్షిపనులతో లేదా 5 బిలియన్ల ఖర్చుతో 8 జలాంతర్గాములతో ఇబ్బంది పెట్టవచ్చు. ( carrier battle groups రక్షిస్తాయి అయినాసరే saturation attack కి అవకాశం ఉంది ). దానికి పరిష్కారం మరింత ఖర్చుతో, క్లిష్టతతో కూడినది.
వీటిని పరిగణలోకి తీసుకుని మూడవ విమాన వాహక నౌకని కొన్ని సంవత్సరాలు వాయిదా వేయడం మంచిది అని నా అభిప్రాయం. భవిష్యత్తులో ఒకే సారి కొంత ఎక్కువ ఖర్చు అయినా అణు చోదక నౌకని సమకూర్చుకోవడం ఉత్తమం.