డయాబెటీస్ ఒకటే అయితే సమస్య లేదు. కాని టైప్ 2 డయాబెటీస్ రోగులకు డిప్రెషన్ తోడైతే అది మతిమరుపుకి కూడా దోవతీస్తుందని వాషింగ్టన్ యూనివర్శిటీ పరిశోధకులు కనిపెట్టారు. ఈ స్టడీలో పరిశోధకులు టైప్ 2 డయాబెటీస్ రోగంతో డిప్రెషన్ వున్న వ్యక్తులను, డిప్రెషన్ లేని వ్యక్తులను పరిశోధించారు. ఈ పరిశోధన ఆర్చివ్స్ ఆఫ్ జనరల్ సైకియాట్రీ అనే జర్నల్ లో ప్రచురించారు. డయాబెటీస్ కు డిప్రెషన్ తోడైన మూడు లేదా అయిదు సంవత్సరాలకల్లా వీరిలో డిమెన్షియా అనే మతిమరుపు వ్యాధి వచ్చేసిందని వాషింగ్జన్ యూనివర్శిటీలోని రీసెర్చర్ ప్రొఫెసర్ వేనే కాటన్ తెలిపారు.
స్టడీలో షుమారు 20 వేలమంది రోగులను పరిశీలించటం జరిగింది. డిమెన్షియాకు మనోవేదన లేదా డిప్రెషన్, డయాబెటీస్ రెండూ ప్రధాన కారణాలుగా తెలిపారు. డయాబెటీక్ రోగులలో సాధారణంగా 20 శాతం మంది డిప్రెషన్ కు కూడా లోనవుతున్నారట. దీనికి కారణాలు పరిశోధిస్తున్నారు. డయాబెటీస్ రోగులకే త్వరగా డిప్రెషన్ ఏర్పడటానికి కారణం ఏమిటి అని పరిశోధిస్తే, డయాబెటీక్ రోగులు సరిగా ఆహారం తీసుకోకపోవడం, లేదా సరైన వ్యాయామ ప్రణాళికలు ఆచరించకపోవడం, స్మోకింగ్ అతిగా చేయటం, షుగర్ లెవెల్స్ నియంత్రణలో వుంచుకోకపోవటం వంటి కారణాలు, మానసిక మార్పులు మనోవేదన లేదా డిప్రెషన్ కు దోవతీస్తున్నాయని, ఈ రెండు వ్యాధులు కలసి డిమెన్షియా కలిగిస్తున్నాయని పరిశోధకులు తేల్చారు.
కనుక డయాబెటిస్ ఉన్నవారు కచ్చితంగా డిప్రెషన్ రాకుండా చూసుకోవాలి. మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అందుకు యోగా, ధ్యానం ఎంతగానో సహాయ పడతాయి. రోజూ ఇష్టమైన సంగీతం వినాలి. పుస్తకాలను పఠించాలి. ప్రకృతిలో వీలైనంత సేపు గడపాలి. అప్పుడప్పుడు విహార యాత్రలకు వెళ్తుండాలి. క్రీడల్లో పాల్గొనాలి. దీంతో మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. డిప్రెషన్ రాకుండా ఉంటుంది.