రైలు ఎక్కిన తర్వాత మనందరికీ ఒక ఫీలింగ్ ఉంటుంది.. ఆ చైన్ లాగితే ఎలా ఉంటుంది అని. చైన్ లాగితే రైలు ఆగుతుంది అని మనకు తెలుసు. కానీ మనం లాగం ఎందుకంటే, ఉత్తినే లాగితే ఫైన్ వేస్తారు కదా. కచ్చితమైన కారణం ఉంటే లాగొచ్చు. మరి ఆ కుర్రాడు ఏం చెప్పాడో తెలుసుకుందాం. ఢిల్లీ-ఆగ్రా రూట్లో మధుర జంక్షన్ రైల్వేస్టేషన్ దగ్గర జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. రైలు మధుర జంక్షన్ నుంచి బయలుదేరింది. ప్రయాణికులు తమ తమ సీట్లలో సెట్ అవుతున్నారు. కొంతమంది నెక్ట్స్ స్టేషన్లో తాము దిగాలని మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతలో ఓ కుర్రాడు.. తాను కూర్చున్న చోటి నుంచి ఒక్కసారిగా లేచాడు. వెంటనే చైన్ లాగేశాడు. రైలు ఆగిపోయింది. గబగబా దిగిపోయాడు. దిగిపోయి.. మిగతా ప్రయాణికులవైపు భయం భయంగా చూస్తూ ఉన్నాడు.
అది గమనించిన మిగతా ప్రయాణికులు దిగి అతన్ని పట్టుకున్నారు. ఎందుకు చైన్ లాగావు? ఏమైంది? అని అడిగారు. ఇంతలో.. అటుగా రైలుకు సంబంధించిన అధికారులు (GRP), రైల్వే రిజర్వ్ పోలీసులూ (RPF) రావడం ప్రారంభించారు. తోటి ప్రయాణికులు అతన్ని పట్టుకొని గట్టిగా అడిగితే.. చైన్ ఎందుకు లాగాడో చెప్పాడు. దాంతో వారంతా ఆశ్చర్యపోయారు. ఎలా స్పందించాలో వారికి అర్థం కాలేదు. అతను చెప్పిన కారణంతో వారికి దిమ్మ తిరిగింది. అతను చైన్ లాగిన తర్వాత ఆగిన ట్రైన్, ఇంకా మధురా స్టేషన్లోనే ఉంది. GRP, RPF అతని దగ్గరకు వచ్చి, పట్టుకొని, ఎందుకు చైన్ లాగావు అని అడిగారు. అతను మరోసారి వాళ్లవైపు భయం భయంగా చూస్తూ.. అందరూ రైలు దిగిపోండి.. ముందే చెబుతున్నా.. దిగిపోండి అని అరిచాడు. దాంతో అధికారులకు ఆశ్చర్యం వేసింది. మళ్లీ అతన్ని గట్టిగా పట్టుకొని నిలదీశారు. అప్పుడు అతను తాను ఎందుకు చైన్ లాగిందీ, ఎందుకు అందర్నీ దిగిపోమంటున్నదీ చెప్పడంతో.. ఆ అధికారులకు కూడా దిమ్మ తిరిగింది.
ఆ కుర్రాడు ఏమన్నాడంటే… అతను బీహారీ జీని సందర్శించి రైల్లో రిటర్న్ వస్తున్నాడు. అతను రైలులో కూర్చున్న వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలో అతనికి చెడ్డ కల వచ్చింది. రైలు ప్రమాదం జరిగినట్లు, పట్టాలు తప్పినట్లు కలవచ్చింది. అప్పుడే మెలకువ వచ్చింది. దాంతో వెంటనే చైన్ లాగేసి రైలు దిగిపోయాడు. ఇదే విషయాన్ని అతను చెప్పడంతో ఎలా రియాక్ట్ అవ్వాలో అధికారులకు అర్థం కాలేదు. సరైన కారణాలు లేకుండా.. ఇలా చైన్ లాగొద్దని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. అతని వివరాలు తీసుకున్నారు. అతనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశవ్యాప్తంగా చాలా మంది ప్రయాణికులు సరైన కారణం లేకుండా చైన్లు లాగుతున్నారు. దీని వల్ల రైళ్లు ఆలస్యమవుతున్నాయి. ఇటీవల ఇలాంటి 372 మందిపై చర్యలు తీసుకున్నామనీ, వారి నుంచి రూ.15,540 జరిమానా రూపంలో వసూలు చేశామని ఉత్తర మధ్య రైల్వే ఆగ్రా డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ తెలిపారు.
వీరిలో ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లో 135 మంది, ఆగ్రా ఫోర్ట్ స్టేషన్లో 18 మంది, మధుర జంక్షన్లో 121 మంది, అచ్నేరా స్టేషన్లో 29 మంది, ధోల్పూర్ స్టేషన్లో 27 మందిపై చర్యలు తీసుకుని జరిమానాలు వసూలు చేశామన్నారు. సరైన కారణం లేకుండా అలారం చైన్ని లాగవద్దని భారతీయ రైల్వే ప్రయాణికులను అభ్యర్థించింది. దీనివల్ల తోటి ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. రైళ్లు సమయానికి నడవడం లేదు. అంతేకాకుండా చైన్ పుల్లింగ్ వల్ల విద్యార్థులు పరీక్షలకు దూరమవుతున్నారనీ, చాలా మంది అస్వస్థత చెందుతుంటే, వారికి సకాలంలో వైద్యం అందడం లేదని తెలిపింది. రైల్వే చట్టం ప్రకారం కారణం లేకుండా చైన్ పుల్లింగ్ చేస్తే, 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు శిక్ష, 1000 రూపాయల జరిమానా ఉంటుంది.