మాటల మాంత్రికుడు, టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర దర్శకులలో ఒకరు త్రివిక్రమ్. మాటలతో ప్రేక్షకులను మైమరపిస్తాడు. కేవలం పోస్టర్ మీద ఈయన పేరు ఉంటే చాలు చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలని ఎంతోమంది హీరోలు ఆశపడుతూ ఉంటారు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి సినిమా ఏంటి..! ఆ సినిమాకి త్రివిక్రమ్ తీసుకున్న అడ్వాన్స్ తో ఏం చేశాడో తెలుసుకుందాం.
లవర్ బాయ్ తరుణ్ హీరోగా, శ్రియ హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి సినిమా నువ్వే నువ్వే. స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో చంద్రమోహన్, ప్రకాష్ రాజ్, రాజీవ్ కనకాల, తనికెళ్ల భరణి, సునీల్, ఎమ్మెస్ నారాయణ, అనిత చౌదరి, శిల్పా చక్రవర్తి సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలై 23 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ సినిమా స్పెషల్ షో నీ ప్రదర్శించారు. ఈ షోలో చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు. షో అనంతరం నాటి ఈ సినిమా అనుభవాలను గుర్తుచేసుకున్నారు దర్శక నిర్మాతలు.
ఈ సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. రచయితగా ఉన్న తనని దర్శకుడుగా పరిచయం చేసిన రవి కిషోర్ కి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అంటూ త్రివిక్రమ్ ఎమోషనల్ అయ్యారు. వనమాలి హౌస్ లో నువ్వే కావాలి షూటింగ్ జరుగుతుంది. రవి కిషోర్ నేను పక్కన ఖాళీ స్థలంలో నడుస్తూ మాటల మధ్యలో కథ చెప్పాను. ఆయన చెక్ తీసి కొంత అమౌంట్ వేసి ఇచ్చారు. నేను ఆ అమౌంట్ తో బైక్ కొనుక్కున్నాను. అని త్రివిక్రమ్ వెల్లడించారు. తనలో ఉన్న రచయితను, దర్శకుడిని తనకంటే ఎక్కువగా గుర్తించిన వ్యక్తి రవి కిషోర్ అని అన్నారు త్రివిక్రమ్. దర్శకుడిగా తనను పరిచయం చేసిన రవి కిషోర్ పాదాలకు ఈ సందర్భంగా త్రివిక్రమ్ నమస్కరించారు.