Covid Cases India Today : దేశవ్యాప్తంగా గత కొద్ది రోజులుగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్యా మాట్లాడుతూ.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సహకారం అందిస్తున్నామని తెలిపారు. స్కూళ్లను మళ్లీ ఓపెన్ చేస్తున్న నేపథ్యంలో 15 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్నవారికి కోవిడ్ టీకాలను అందించే విషయమై నిపుణులతో చర్చిస్తున్నామని తెలిపారు. కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 71,365 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ క్రమంలోనే దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,24,10,976కు చేరుకుంది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 8,92,828కు చేరుకుంది.
కోవిడ్ కారణంగా సంభవించిన మొత్తం మరణాల సంఖ్య 5,05,279కి చేరుకోగా, గడిచిన 24 గంటల్లో 1217 మంది చనిపోయారు. యాక్టివ్ కేసుల శాతం 2.11 గా ఉండగా.. రికవరీ రేటు 96.70 శాతానికి చేరుకుంది. ఇక గడిచిన 24 గంటల్లో యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. మొత్తం 1,02,063 యాక్టివ్ కేసులు తగ్గాయి.
దేశంలో ఆగస్టు 7, 2020వ తేదీన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 20 లక్షలు దాటగా, ఆగస్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు, సెప్టెంబర్ 16న 50 లక్షలు దాటింది. సెప్టెంబర్ 28న మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 60 లక్షలు దాటింది. అలాగే అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షలు దాటింది. డిసెంబర్ 19, 2020న మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 1 కోటి మార్కును దాటింది.