ఇంకా మార్చి నెల రాక ముందే ఎండలు మండిపోతున్నాయి. మరో వైపు జనాలు చల్లదనం కోసం ఇప్పటి నుంచే పరుగులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు కూలర్లను బయటకు తీస్తుంటే కొందరు ఏసీలలో గడుపుతున్నారు. అయితే మీకు తెలుసా..? ప్రకృతి సహజసిద్ధ వాతావరణంలో కాక కృత్రిమంగా సృష్టించిన చల్లని వాతావరణంలో ఉంటే దాంతో మనకు అనారోగ్య సమస్యలు వస్తాయట. అవును, మీరు విన్నది నిజమే. ఇది మేం చెబుతోంది కాదు, వైద్యులు చెబుతున్నారు. నిత్యం ఏసీ కార్లు, రూముల్లో ఉండే వారు కచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అదేమిటంటే… సహజమై సిద్ధమైన వాతావరణంలో శరీరం భరించదగ్గ ఉష్ణోగ్రతలో జీవించడం జీవరాసులన్నింటికీ ప్రకృతి పరమైన రక్షణ కల్పిస్తుంది. కానీ ప్రకృతి విరుద్ధమైన పద్ధతుల్లో కృత్రిమ చల్లదనం కోసం మనం వేసే ప్రతి అడుగూ ఆరోగ్యానికి ప్రమాదమే అంటున్నారు నిపుణులు. అదేపనిగా ఏసీలో కూర్చొని పనిచేస్తే పని ముగిసే సమయానికి భరించలేని తలనొప్పి, నిస్సత్తువ వంటి లక్షణాలు కనిపిస్తాయి.
చల్లటి వాతావరణంలో కండరాలకు తగినంత రక్తప్రసరణ జరగకపోవడం వల్ల అలసటకు గురవుతారు. పొడి చర్మం ఉన్న వారు ఏసీలో ఎక్కువసేపు గడపడం వల్ల చర్మంపై తేమ తగ్గుతుంది. చర్మం పొడిబారుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే చర్మంపై మాయిశ్చరైజర్ని రాసుకోవాలి. దీర్ఘకాలిక సమస్యలు అంటే.. ఆర్థరైటిస్, న్యూరైటిస్ వంటి జబ్బులు ఉన్నవారిలో ఆ సమస్యలు తీవ్రమవుతాయి. కొందరిలో ఈ న్యూరైటిస్ కారణంగా నిస్సత్తువ కలిగే అవకాశాలు ఎక్కువ.
గతంలో వేడి వాతావరణంలో ఉన్నవారైనప్పటికీ నిత్యం ఏసీలో ఉండడం అలవాటైన వారు ఇక ఏ మాత్రం వేడిని భరించలేరు. దాంతో తేలిగ్గా వడదెబ్బ బారిన పడతారు. చాలాసేపు ఏసీ కారులో, మూసి ఉన్న డోర్స్ వల్ల అక్కడి సూక్ష్మజీవులు అక్కడే తిరుగుతుండం వల్ల తేలిగ్గా శ్వాస సంబంధమైన వ్యాధులకు గురవుతుంటారు. ఇన్ఫెక్షన్లు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. నిత్యం ఏసీలో ఉండేవారు తప్పనిసరిగా ప్రతి రెండు గంటలకు ఒకసారి కాసేపు బయటకు వచ్చి సహజ వాతావరణంలో పదినిమిషాల పాటైనా గడిపి వెళ్తుండాలి. అలా చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.