మన శరీర భాగాలు సరిగ్గా పనిచేయాలంటే రక్తం అవసరం ఉంటుంది. రక్తం ఆయా భాగాలకు అవసరం అయ్యే ఆక్సిజన్ను, శక్తిని, పోషకాలను రవాణా చేస్తుంది. అందువల్ల రక్త సరఫరా మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి. దీంతో శరీరంలోని అన్ని భాగాలు చురుగ్గా పనిచేస్తాయి. అయితే రక్త సరఫరా మెరుగ్గా లేకపోతే అనేక సమస్యలు వస్తాయి. గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కానీ కింద తెలిపిన ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుచుకోవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే…
దానిమ్మ పండ్లను నిత్యం తినడం వల్ల లేదా వాటి జ్యూస్ను తాగినా శరీరంలో రక్తం బాగా ఉత్పత్తి అవుతుంది. అంతేకాదు రక్త సరఫరా కూడా మెరుగు పడుతుంది. అలాగే బీట్రూట్, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటాలు, నిమ్మజాతికి చెందిన పండ్లను తరచూ తీసుకోవాలి. దీంతో కూడా రక్త సరఫరాను మెరుగు పరుచుకోవచ్చు.
వాల్నట్స్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు వెంట్రుకలు, మెదడుకు ఎంతగానో మేలు చేస్తాయి. వారంలో కనీసం 3 నుంచి 4 సార్లు వీటిని తినడం వల్ల కూడా రక్త సరఫరా మెరుగు పడుతుంది.
తాజా ఆకుకూరలు, కూరగాయలు, పసుపు, స్ట్రాబెర్రీలు, చెర్రీ పండ్లు, మల్బెర్రీలను తినడం వల్ల కూడా శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హైబీపీ ఉన్నవారు వీటిని తీసుకుంటే బీపీని తగ్గించుకోవచ్చు.