ప్రస్తుతం మనకు మార్కెట్లో చాలా వరకు పూర్తిగా పండని అరటి పండ్లే దొరుకుతున్నాయి. పూర్తిగా పండిన అరటిపండ్లను కొందామంటే కనిపించడం లేదు. దీంతో బాగా పండని అరటిపండ్లనే చాలా మంది కొని తింటున్నారు. అయితే నిజానికి మనం పూర్తిగా పండిన అరటి పండ్లనే తినాలి. ఎందుకంటే.. బాగా పండని అరటి పండ్ల కన్నా బాగా పండిన అరటి పండ్లలోనే మనకు పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. ఇంకా అనేక ఇతర ప్రయోజనాలు కూడా మనకు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బాగా పండిన అరటి పండ్లు మనకు చాలా తేలిగ్గా జీర్ణమవుతాయి. దీంతో పోషకాలు కూడా మనకు ఎక్కువే లభిస్తాయి. బాగా పండిన అరటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
అరటి పండ్లను బాగా పండి ఉన్నప్పుడు తింటేనే రుచిగా ఉంటాయి. వాటిల్లో పొటాషియం ఎక్కువగా లభిస్తుంది. చిన్నారులకు సైతం బాగా పండిన అరటి పండ్లను తినిపిస్తేనే ప్రయోజనం ఉంటుంది. వారు వాటిని తేలిగ్గా జీర్ణం చేసుకోగలుగుతారు.
బాగా పండిన అరటి పండ్లలో ప్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది, కనుక అది మన శరీరంలో గ్లూకోజ్ గా మారి శక్తి అందుతుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు బాగా పండని అరటి పండ్లను తింటేనే మంచిది. వాటిలో తీపి తక్కువగా ఉంటుంది. దీనికి తోడు వాటిని తినగానే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా ఉంటాయి.