మహాత్మగాంధీ… స్వాతంత్ర్య ఉద్యమంలో చెరగని స్థానం సంపాదించుకున్న గొప్ప వ్యక్తి. మన అందరి గుండెల్లో కలకాలం కొలువుండే మహనీయుడుగా, జాతిపితగా నిలిచిపోయారు. స్వాతంత్ర్యోద్యమంలో గాంధీ పాత్రను మనం మరువలేం. అహింసే ఆయుధంగా ఆయన మనకు స్వాతంత్ర్యాన్ని తెచ్చి పెట్టారు. అయితే గాంధీజీ.. అనగానే ముందుగా మనకు ఆయన ధోవతి రూపం కళ్ల ముందు కనిపిస్తుంది. మరి అసలు ఆయన ధోతి ఎందుకు ధరించారో తెలుసా..? సౌతాఫ్రికాలో లా కోర్సు చదివారాయన. అయిప్పటికీ ధోవతి ధరించారు. ఇందుకు గల కారణాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రారంభంలో గాంధీ ఒక కోట్, ప్యాంట్, టోపీ ధరించేవారు. తరువాత ధోవతి, పొడవైన కోటు, తలపాగా ధరించడం ప్రారంభించారు గాంధీజీ. అనంతరం ఆయన ఖాదీతో తయారైన దుస్తులను మాత్రమే ధరించాలని భావించారు. ఖాదీ చొక్కా, ఖాదీ శాలువా, ఖాదీ దోవతి, ఖాదీ టోపి, ధరించడం ప్రారంభించారు. ఇలా గాంధీజీ తన డ్రెస్సింగ్ లో ఎప్పటికప్పుడు దుస్తులను మారుస్తూ వచ్చారు. చివరకు ధోవతి మాత్రమే ధరించడం మొదలు పెట్టారు. ఇది ఎలా జరిగిందంటే..
గాంధీ యువకుడిగా ఉన్నప్పుడు దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడ తన తోటి ప్లీడర్స్, న్యాయవాదులతో కలిసి పని చేశారు. అందువల్ల అక్కడి సంప్రదాయాలకు అనుగుణంగా వెస్ట్రన్ స్టైల్ లో ఆయన అక్కడ బట్టలు ధరించారు. అయితే అక్కడ భారతీయులు అణిచివేతకు గురయ్యేవారు. దీంతో ఆయన సత్యాగ్రహం చేపట్టారు. వేలాది మంది భారతీయులు ఆయన వెంట నడిచారు. వారంతా పేదలే. దీంతో వారందరి నాయకుడిగా తన నడవడిక ఎలా ఉంటే బాగుంటుంది ? అని ఆలోచించాడు గాంధీజీ. వెంటనే తన వేషధారణ మార్చేశాడు. తనతో పాటు ఉద్యమంలో పాల్గొనేవారిలా సామాన్యుడిగా మారాలనుకున్నాడు. అందుకే తన వెస్ట్రన్ స్టైల్ కు గుడ్ బై చెప్పేశారు. ఒక లుంగీ, చొక్కా ధరించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే దక్షిణాఫ్రికాలో భారతీయుల కోసం పోరాడారో.. అప్పుడే ఆ మదిలో మరో ఆలోచన వచ్చింది. తన మాతృభూమి భారతదేశంలో సాగుతున్న అరాచకాలపై ఉద్యమం చేపట్టాలని నిర్ణయించుకున్నారు.
వెంటనే భారత్కు వచ్చి ఇక్కడ స్వాతంత్ర్య ఉద్యమానికి నడుం బిగించారు. ఇక్కడ కూడా సత్యాగ్రహం, తదితర ఉద్యమాలు చేపట్టారు. అయితే ఆయన దక్షిణాఫ్రికా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం కోటు, ప్యాంటు ధరించలేదు. తన జన్మస్థలం ఖతియావాడలో ధరించే సంప్రదాయ దుస్తులతోనే ఇక్కడ నౌక దిగారు. గాంధీజీ భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు ఒక పంచె, పొడవాటి కోటు ధరించారు. అలాగే ఒక ఆయన భుజంపై ఒక శాలువా, తలపాగా ధరించారు. ఇక ఇక్కడ స్వాత్రంత్య ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కూడా ఆయన వేషధారణ ఒక పేద వ్యక్తి మాదిరిగానే ఉండేది. అయితే ఒకసారి ఒక కోర్టు కేసులో ముగ్గురు భారతీయ మహిళలు కేవలం ఒకే చీరను కట్టుకుని వచ్చి సాక్ష్యం చెప్పడాన్ని గాంధీజీ గమనించారట. దీంతో తన 40 కోట్ల మంది సోదరీమణులు చినిగిన పాత బట్టలు వేసుకుంటూ జీవిస్తుంటే తాను మాత్రం ఖరీదైన బట్టలు ఎలా వేసుకుంటాను అని గాంధీ భావించారు. అందుకే ఆయన అప్పటి నుంచి కేవలం ధోవతి మాత్రమే ధరించడం మొదలు పెట్టారు. అలా 1921, సెప్టెంబర్ 22వ తేదీ నుంచి గాంధీ ధోవతి ధరించడం మొదలు పెట్టారు..!