చనిపోయిన తర్వాత మనిషి ఏమైపోతాడు? అనే ప్రశ్న ఉత్పన్నం అయినప్పుడు..మంచి చేస్తే స్వర్గానికి, చెడు చేస్తే నరకానికి అని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే స్వర్గానికి పోయే శరీరాన్ని కాసేపు పక్కనపెడితే నరక ప్రయానం ఎలా ఉంటుందో గరుడ పురాణం పూర్తిగా వివరించబడింది. గరుడపురాణం ప్రకారం 47 రోజులు అత్యంత కష్టాలతో యమపురి ప్రయాణం సాగుతుంది. హత్యలు, అక్రమాలు, మానభంగాలు, దొంగతనాలు, కరుడుగట్టిన నేరాలు చేసిన వాళ్లు తప్పకుండా నరకానికే వెళ్తారని గరుడ పురాణం చెబుతోంది. చనిపోయే సమయం దగ్గర పడుతున్న వేళ సరిగా మాటలు రావు. చావుకి దగ్గరైనా ఆ వ్యక్తికి మాట్లాడాలని ఉన్నా.. ఏం మాట్లాడలేకపోతాడు. శరీరమంతా స్పర్శ నాశనం అయి ఎలాంటి చలనం లేకుండా.. గట్టిగా మారిపోతుంది. దివ్యదృష్టి తెరుచుకుని చుట్టు జరుగుతున్న ప్రతి విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారట.
ఇంకో క్షణంలో తాను చనిపోతున్నా అని తెలియగానే తన కళ్ల ముందు యమరాజు పంపిన యమభటులు కనిపిస్తారు. భయకరమైన రూపంలో కనిపించే యమదూతలను చూడగానే నోరు తడారిపోతుంది. చచ్చిన శరీరం నుండి ఆత్మను తీసుకుని యమదూతలు ప్రయాణం ప్రారంభిస్తారు. వైతరణి నదీ పరిహాక ప్రాంతంలో ఈ ప్రయాణం అత్యంత భయంకరంగా సాగుతూ ఉంటుంది. 47 రోజులు చిత్రహింసలకు గురి చేస్తూ ఆత్మను తమ వెంట తీసుకెళుతారు యమదూతలు. ఈ ప్రయాణంలో ఆత్మ అలసిపోయినా.. విశ్రాంతి తీసుకోవడానికి యమదూతలు అనుమతించరు.
ఇక ఆత్మకు యమభటులు పెట్టే క్షోభ అంతా ఇంత కాదు. యమలోకానికి జరుగుతున్న ప్రయాణంలో ఆత్మను యమధూతలు చాలా భయాందోళనకు గురిచేస్తారు. నరకంలో యమరాజు చెప్పే శిక్షల గురించి వివరించి వణుకుపుట్టేలా చేస్తారు. ఈ సమయంలో ఆత్మ ఏడవడం మొదలుపెడుతుంది. కానీ.. యమదూతలు జాలి, కరుణ, కనికరం చూపించకుండా మరింత బాధపెడుతూ ఆనందపడుతుంటారు. యమపురి ప్రయాణంలో ఆత్మలు నడవలేక సొమ్మసిల్లి పడిపోతుంటాయి. కానీ యవభటులు లేపి మరీ కొరడాతో కొట్టుకుంటూ తీసుకెళుతారు. ఎక్కడ ఆగడానికి అవకాశం ఉండదు. ఇక నా వల్ల కాదని మొండిగా వ్యవహరించే ఆత్మలను యమదూతలు అతి కిరాతకంగా చర్నాకోలల్లాంటి కొరడాలతో కొడుతారు. అగ్నిలా మండిపోతున్న ఇసుకలో నడిపించుకుంటూ తీసుకెళుతారు. ఆత్మలు అత్యంత బాధకరమైన ఆ దారిలో నడవలేకపోతాయి. అలాగే ఆకలితో ఉంటాయి. ఆ సమయంలో యమదూతలు ఆత్మలను కొరడాతో కొడుతూ మరింత నరకం చూపిస్తాయి.
ఇక ఎలాగోలా యమలోకానికి చేరిన వెంటనే యమరాజు చివరి సారిగా ఆత్మను చనిపోయిన స్థలానికి పంపిస్తాడు. ఇన్నాళ్లు ఉన్న తన శరీరం అంత్యక్రియలను చూసుకునే అవకాశాన్ని కలిగిస్తాడు. చనిపోయిన వ్యక్తికి తన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేస్తున్నారా .? లేదా. ? ఆత్మ శాంతి కోసం కర్మ నిర్వహిస్తారా లేదా అని తెలుసుకోవడానికి ఆత్మ మళ్లీ కిందకు వస్తుంది. ఒకవేళ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించకపోతే.. ఆత్మ ప్రశాంతంగా ఉండే ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం వ్యక్తి చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు 10 రోజుల లోపే పిండ ప్రదానం చేయాలి. లేదా ఇక ఆత్మకు మోక్షం ఉండదు.