Matar Paneer Masala : ప‌చ్చి బ‌ఠానీలు, ప‌నీర్‌తో చేసే మ‌సాలా కూర‌.. అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు..

Matar Paneer Masala : మ‌నం ప‌న్నీర్ తో వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాం. ప‌న్నీర్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ప‌న్నీర్ తో చేసే ఎటువంటి వంట‌కాలైన‌ చాలా రుచిగా ఉంటాయి. ప‌న్నీర్ ను ఆహారంగా తీసుకోవ‌డం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ప‌న్నీర్ తో చేసే వంట‌కాల్లో మ‌ట‌ర్ ప‌న్నీర్ మ‌సాలా కూడా ఒక‌టి. ఈ వంట‌కం ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. బ్యాచిల‌ర్స్ అలాగే వంట‌రాని వారు కూడా చాలా సుల‌భంగా చేసుకునేలా ఈ మ‌ట‌ర్ ప‌న్నీర్ మ‌సాలాను ధాబా స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ధాబా స్టైల్ మ‌ట‌ర్ ప‌న్నీర్ మసాలా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌న్నీర్ – 200 గ్రా., ప‌చ్చి బ‌ఠాణీ – పావు క‌ప్పు, బ‌ట‌ర్ – ఒక టేబుల్ స్పూన్, క‌సూరి మెంతి – ఒక టేబుల్ స్పూన్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, యాల‌కులు – 2, ల‌వంగాలు – 3, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – ముప్పావు క‌ప్పు, కారం – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, జీల‌కర్ర పొడి – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ట‌మాటాలు – 2, నీళ్లు – ఒక క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Matar Paneer Masala dhaba style very tasty
Matar Paneer Masala

ధాబా స్టైల్ మ‌ట‌ర్ ప‌న్నీర్ మ‌సాలా త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో బ‌ట‌ర్ వేసి వేడి చేయాలి. బ‌ట‌ర్ వేడ‌య్యాక ప‌న్నీర్ ముక్క‌ల‌ను వేసి 5 నిమిషాల పాటు క‌లుపుతూ వేయించాలి. త‌రువాత క‌సూరి మెంతిని వేసి క‌లపాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, దాల్చిన చెక్క‌, ల‌వంగాలు, యాల‌కులు వేసి వేయించాలి. త‌రువాత క‌రివేపాకు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత అల్లం పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి రంగు మారే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత కారం, ఉప్పు, ప‌సుపు, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి మాడిపోకుండా ఒక నిమిషం పాటు వేయించాలి. త‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీగా చేసి వేసుకోవాలి.

దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలేచ వ‌ర‌కు వేయించాలి. త‌రువాత బ‌ఠాణీల‌ను వేసి క‌ల‌పాలి. త‌రువాత నీటిని పోసి మూత పెట్టి ప‌ది నిమిషాల పాటు ఉడికించాలి. బ‌ఠాణీలు మెత్త‌గా అయ్యి ద‌గ్గ‌ర ప‌డిన త‌రువాత ముందుగా వేయించిన ప‌న్నీర్ ముక్క‌ల‌ను వేసి క‌లపాలి. దీనిని మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించి, చివ‌ర‌గా కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ధాబాలో ల‌భించే విధంగా ఉండే మ‌ట‌ర్ ప‌న్నీర్ మ‌సాలా త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ, పుల్కా, పులావ్, వెజ్ బిర్యానీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ మ‌ట‌ర్ ప‌న్నీర్ కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts