ఇన్నేళ్ల భారత చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం రాజకీయ జాతి సమస్తం కుంభకోణాల పరాయనత్వం. గడిచిన ఏళ్లలో భారత్ లో జరిగిన కుంభకోణాల చిట్టా తీస్తే షాక్ కు గురి కావాల్సిందే. దేశంలో ఏ ప్రభుత్వం పాలనలోఉన్నా కుంభకోణాలు మాత్రం ఆగడం లేదు. ఒక ప్రభుత్వానికి మించి మరో ప్రభుత్వం.. ఒక కుంభ కోణానికి మించి మరో కుంభకోణం. మట్టిని, నీరును, చెట్టును, పుట్టను చివరికి పశువులు తినే గడ్డిని సైతం తినేసి బొర్రలు పెంచిన ఉద్దండులే మన రాజకీయ నాయకులు. ఒక్క సారి వారి బాగోతాల వైపు చూస్తే దేశ ఆర్డిక వ్యవస్థ ఎందుకు దిగజారుతుందో ఇట్టే అర్థం అవుతుంది. అవినీతిలో మన స్థానం అగ్రభాగంలో ఉంటుంది. ఢిల్లీలోని నేషనల్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ లెక్కల ప్రకారం లక్షల కోట్ల నల్లధనం మగ్గుతోంది. ఈ లెక్కలు పాతవి.. ఇప్పటికి ఇంకా నల్ల ధనం ఎంతగా పెరిగిపోయిందో చెప్పడం కష్టం.
2012 భారత చరిత్రలో ఆర్థిక వ్యవస్థకు మసి అంటుకున్న కాలం. జనాల డబ్బును అప్పనంగా కాజేస్తూ భారీ మొత్తంలో కుంభకోణానికి తెరలేపిన స్కాం బొగ్గు స్కాం. ఇందులో ఏకంగా 1.86 లక్షల కోట్ల అవినీతి జరిగింది. 2008 లో చోటు చేసుకున్న 2 జీ స్పెక్ట్రమ్ స్కాం 1.76 లక్షల భారీ కుంభకోణం 2వ స్థానాన్ని సంపాదించుకుంది. టెలికాం మినిస్టర్ రాజా హయంలో చేటు చేసుకున్న ఈ భారీ కుంభకోణం దేశ ఆర్థిక వ్యవస్థను ఓ కుదుపు కుదుపేసింది. మార్చ్ 2012లో బయట పడ్డ మరో భారీ కుంభ కోణం వక్ప్ బోర్డ్ లాండ్ స్కాం. కర్ణాటక రాష్ట్ర మైనార్టీ కమిషన్ ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ భారీ కుంభకోణ గుట్టు రట్టైంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం వక్ప్ బోర్డు కు చెందాల్సిన భూములను పక్కదారి పట్టించినట్టుగా పూర్తి సాక్ష్యాధారాలతో బయటపెట్టింది కర్ణాటక రాష్ట్ర మైనార్టీ కమిషన్. ఈ స్కాంలో ఏకంగా 1.56 లక్షల డబ్బు చేతులు మారినట్టు తేలింది.
21 వ శతాబ్ధంలోనే కాదు 20వ శతాబ్దాన్ని కూడా వీడలేదు కుంభకోణ ఘనులు. స్వాతంత్య్రం సిద్దించిన రోజు నుండి ఇప్పటి వరకు అవకాశం కోసం చూస్తునే ఉన్నారు స్కాం దొంగలు. 1980, 90 దశకంలో చోటు చేసుకున్న అతి పెద్ద కుంభకోణం భోపోర్స్ కుంభకోణం. అప్పటి ప్రధానిగా ఉన్న నేతే స్వయంగా ఈ కుంభకోణానికి పాల్పడినట్టు దేశ భధ్రత వ్యవస్థ తేల్చింది. రక్షణ వ్యవస్థకు చెందిన అధునాతన ఆయుధాల కొనుగోలులో ఈ కుంభకోణం చోటు చేసుకుంది. ఆ తరువాత దేశంలో అల్లర్లు తారా స్థాయికి చేరిన విషయం తెలిసిందే. స్కాంల దాదాలు పశువుల గడ్డిని కూడా వదలలేదు. 1990 లో చోటు చేసుకున్న ఈ కుంభకోణం రాజకీయ నేతలు డబ్బుకోసం ఎంతకైనా దిగజారుతారని తేల్చింది. 1000 కోట్ల భారీ స్కాం కు పల్పాడిన సదరు నేత ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో.