వైసీపీ తరఫున గత ప్రభుత్వంలో ఉండి.. పార్టీని, అప్పటి సీఎం జగన్ను కూడా హైలెట్ చేసిన వారు.. అదేసమయంలో అప్పటి విపక్ష నాయకులైన చంద్రబాబు, పవన్ కల్యాణ్లను ఇష్టానుసారంగా దూషించిన వారు ఇప్పుడు జైల్లో మగ్గుతున్న విషయం తెలిసిందే. వీరిలో ఒక్క పోసాని కృష్ణమురళి మాత్రమే అతి కష్టంమీద బెయిల్పై బయటకు వచ్చారు. అది కూడా అనేక షరతులకు లోబడి కోర్టు.. ఆయనకు షరతులు ఇచ్చింది. ఇక, బెయిల్ రాకుండా.. మగ్గుతున్నవారు కూడా ఉన్నారు.
వీరిలో కీలక నాయకుడు.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, అదేవిధంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్ బోరుగడ్డ అనిల్కుమార్ వంటివారు ఉన్నారు. వీరు ఎప్పుడు బయటకు వస్తారో కూడా తెలియని ఒక సందిగ్ధ వాతావరణం నెలకొంది. తాజాగా వంశీకి ఉన్న రిమాండ్ గడువు ముగిసింది. దీంతో ఆయన ఇక, తనకు బెయిల్ దక్కుతుందని ఎదురు చూశారు. కానీ, విజయవాడ కోర్టు మాత్రం బెయిల్ పిటిషన్పై విచారణను వాయిదా వేసింది. దీంతో వంశీకి మళ్లీ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ పరిణామాలతో వంశీ సహా ఆయన అనుచరులు పార్టీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాము ఇన్నికష్టాల్లో ఉంటే.. కనీసం న్యాయసాయం కూడా చేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. పార్టీ నాయకుల నుంచి కనీసం పరామర్శ కూడా కరువైందని.. అప్పుడెప్పుడో.. ఒకసారి సీఎం జగన్ వచ్చి వెళ్లడమే తప్ప. ఆ తర్వాత తమ మొహం కూడా చూడలేదన్నది వంశీ ఆవేదన.
ఇక, ఇదే కేసులో అరెస్టయిన.. మరికొందరు కూడా ఇదే ఆవేదన ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఇప్పుడు కూడా బెయిల్ దక్కకపోవడం.. ఇప్పటికే రెండు మాసాలుగా జైల్లోఉండడంతో వంశీ అయితే.. నిప్పులు చెరుగుతున్నట్టు సమాచారం. ఇక, సోషల్ మీడియా యాక్టివిస్ట్ బోరుగడ్డ అనిల్ పరిస్థితి పెనంపై నుంచిపొయ్యిలో పడినట్టు అయింది. ఆయనపై కోర్టు ధిక్కరణ కింద కేసు పెట్టాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ కోర్టులో విచారణ పరిధిలో ఉంది. దీనిపై నిర్ణయం తీసుకుంటే.. ఆయన కు మరిన్ని ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. అంతేకాదు.. రాజమండ్రి జైలు అధికారుల ముందు నిర్ణీత సమయంలోగా లొంగిపోకపోవడాన్ని కూడా కోర్టు తీవ్రంగా తీసుకుంది. ఇలాంటి సమయంలోతనకు న్యాయసాయం అందించేందుకు బలమైన న్యాయవాదులను నియమించేందుకు పార్టీ ప్రయత్నాలు చేయడం లేదని బోరుగడ్డ తన వారితో వ్యాఖ్యానిస్తున్నారు. ఇంత చేసింది ఎవరికోసం.. నా కోసమా? అని అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. మొత్తంగా జైలు పక్షలు జగన్పై నిప్పులు చెరుగుతున్నారు.