Crispy Potato Fry : బంగాళాదుంపలతో కూడా మనం వివిధ రకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంపలను ఇష్టపడే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. బంగాళాదుంపలతో చేసే ఎటువంటి వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా బంగాళాదుంపల వేపుడు ఎంతో రుచిగా ఉంటుంది. ఈ బంగాళాదుంపల వేపుడును రుచిగా, కరకరలాడుతూ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రిస్పీ పొటాటో ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
బంగాళాదుంపలు – 300 గ్రా., నూనె – రెండున్నర టేబుల్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెబ్బ, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 1, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 8, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్.

క్రిస్పీ పొటాటో ఫ్రై తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలను పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను నీటిలో వేసి 3 నుండి 4 సార్లు బాగా కడగాలి. తరువాత ఉప్పు వేసిన నీటిలో ఒకసారి బాగా కడిగి నీళ్లు లేకుండా చేసుకోవాలి. తరువాత ఒక కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడయ్యాక బంగాళాదుంప ముక్కలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై మాడిపోకుండా కలుపుతూ కరకరలాడే వరకు పూర్తిగా వేయించాలి.
ఇలా వేయించిన బంగాళాదుంప ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి దినుసులు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ముందుగా వేయించుకున్న బంగాళాదుంప ముక్కలను వేసి కలపాలి. తరువాత కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి కలుపుతూ 2 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రుచిగా క్రిస్పీగా ఉండే బంగాళాదుంపల ఫ్రై తయారవుతుంది. దీనిని పప్పు, రసం, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసిన బంగాళాదుంపల వేపుడును అందరూ ఇష్టపడతారు.