రోజూ ఆహారంలో తీసుకునే కూరగాయల్లోనూ రోగకారక క్రిములు ఉన్నట్టు అమెరికా శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఇటీవలికాలంలో ఐరోపా తదితర దేశాలను వణికించిన ఇ-కొలి, సల్మోనెలా క్రిములు కూరగాయల్లో తిష్టేసుకుని ఉన్నాయని వారు హెచ్చరిస్తున్నారు. కూరగాయలను ఎన్నిమార్లు నీళ్లల్లో కడిగినా ఈ క్రిములను తొలగించడం సాధ్యం కాదన్నది శాస్త్రవేత్తల వాదనగా ఉంది. అంటువ్యాధులు సోకడానికి దారితీసే ఈ క్రిములు పరోక్షంగా ఇన్ఫెక్షన్ సోకడానికి మూలకారణం అవుతున్నాయని అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు సెలవిస్తున్నారు.
ఇ-కొలి కలిగించే దుష్ఫలితాలు ఎంతగా ఉంటాయో విదితమే. ప్రధానంగా చిక్కుడుకాయ (బీన్స్) రకాల్లో ఈ ఇ-కొలి, వేరుశెనగకాయలలో సాల్మోనెల్లా ఉంటుందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. మొక్కల్లో న్యూట్రిషన్లను రవాణా చేసే కణాల్లోనూ ఈ క్రిములు చొచ్చుకుపోగలుగుతాయని అధ్యయన సహ పరిశోధకుడు డాక్టర్ ఆమండ డీరింగ్ తెలిపారు.
ఈ అధ్యయనం తాలూకు కథనాన్ని ఫుడ్ ప్రొటెక్షన్, ఫుడ్ రీసెర్చ్ ఇంటర్నేషనల్ జర్నల్ సంచికలో ప్రచురించారు. కూరగాయ మొక్కల్లోకి చేరిన క్రిములను గుర్తించడం ఓ సవాల్గా మారింది. ఇలాంటి ప్రమాదకర క్రిములున్న కూరగాయలను వండి తినేముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలని వీరు తెలిపారు. క్రిములను హరించే ఉష్ణోగ్రతలో కూరలను వండాలని తెలిపారు.