సోమవారాల్లో భక్తులు ఉపవాసం ఉండి, శివుడికి అభిషేకాలు చేయాలి. అనంతరం పార్వతీ దేవికి కుంకుమ పూజ చేయాలి. దీంతో వివాహిత స్త్రీలకు సౌభాగ్యం కలకాలం ఉంటుందని నమ్ముతారు. ఒకప్పుడు తులసి భర్త అయిన శంఖాసురుడనే రాక్షసున్ని శివుడు సంహరించాడట. దీని గురించి శివ పురాణంలో ఉంది. అప్పటి నుంచి తులసి ఆకులతో శివున్ని పూజించడం మానేశారు. ఇప్పటికీ అదే ఆచారం కొనసాగుతోంది. ఒక వేళ ఎవరైనా తులసి ఆకులతో పూజ చేస్తే వారికి అన్నీ అశుభాలే కలుగుతాయట. కాబట్టి శివున్ని తులసి ఆకులతో పూజించడం మానుకోండి.
కొన్ని వేల యుగాల కిందట అత్యంత పెద్దదైన శివలింగం వెలసిందట. దానికి మొదలు, చివర అనేవి లేవట. అయితే వాటిని కనిపెట్టడం కోసం బ్రహ్మ, విష్ణువులు శివుని నుంచి అంగీకారం తీసుకుని వెళ్తారట. అలా వారు వెళ్లినప్పుడు విష్ణువు లింగం మొదలును, బ్రహ్మ దేవుడు లింగం చివరను కనిపెట్టేందుకు చెరో దిక్కుకు వెళ్తారు. అయితే ఎంత సేపటికి లింగం మొదలు కనబడకపోవడంతో విష్ణువు వెనుదిరుగుతాడట. కానీ బ్రహ్మ దేవుడు తనకు లింగం చివర కనబడిందని శివునికి అబద్దం చెబుతాడట. ఈ క్రమంలో అతనికి కేతకి అనే పువ్వు సహాయం చేస్తుందట. దీంతో నిజం తెలుసుకున్న శివుడు ఆగ్రహం చెందుతాడు. అలా కేతకి పువ్వు కూడా శివపూజలో స్థానం కోల్పోతుంది. ఒక వేళ ఎవరైనా శివున్ని పూజిస్తే ఆ పూవును మాత్రం వాడకూడదు.
పసుపును మనం పూజల్లో వాడుతుంటాం. అయితే శివ లింగం పూజకు పసుపును మాత్రం వాడకూడదట. ఎందుకంటే శివలింగం రెండు భాగాల్లో ఉంటుంది. ఒకటి లింగం, మరొకటి జలధారి. లింగం శివున్ని సూచిస్తే, జలధారి పార్వతిని సూచిస్తుంది. కాబట్టి పసుపుతో లింగాన్ని పూజించకూడదు. అందుకు బదులుగా జలధారిని పూజించాలి.