ప్రతి రోజు మనం తినే ఆహారంలో ఎన్నో రకాల మసాలా దినుసులును వాడుతున్నాము. అవి రుచిని పెంచడానికి మాత్రమే అని అనుకుంటే పొరపాటే. మసాలా దినుసుల వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. జీలకర్ర వల్ల జీర్ణప్రక్రియ ఎంతో మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరంగా ఉండటం, అజీర్తి వంటి సమస్యల తో బాధపడుతున్న వారికి జీలకర్ర ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి సమస్యలున్నప్పుడు జీలకర్రను నిమ్మ రసం తో కలిపి ఉదయం, సాయంత్రం తినడం మేలు. ఇలా చేయడం వల్ల కడుపు లోని వేడి తగ్గి ఎటువంటి సమస్య అయినా మాయం అవుతుంది.
ధనియాలు కూడా జీర్ణప్రక్రియకు మేలు చేస్తాయి. వీటిని ప్రతిరోజు ఉపయోగించడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ధనియాలు, జీలకర్ర, మిర్చి, కరివేపాకులను నేతి లో వేయించి ఉప్పు కలుపుకొని గ్రైండ్ చేసి, ఈ పొడిని ప్రతి రోజు అన్నం లో తినడం వల్ల నోటికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తాయి. ధనియాల కషాయంలో పంచదార వేసుకుని తాగితే మంచి నిద్ర వస్తుంది.
ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో పసుపుని తప్పని సరిగా వాడాలి. శరీరం లోని రక్తాన్ని శుద్ధి చేయడానికి పసుపు ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు వాత, పిత్త, కఫ రోగాలను నయం చేస్తుంది. పసుపును వేడి నీటిలో లేదా పాలలో కలుపుకుని తాగడం వల్ల జలుబు,దగ్గు వంటివి తొలగుతాయి.