హిందువులు దేవుళ్ళను ఎక్కువగా నమ్ముతారు. అయితే వారి నమ్మకం నిజమైన ఘటనలు కూడా లేకపోలేదు. తొలి ఏకాదశి అంటే అందరికి ఎంతో పవిత్రమైన రోజు. ఈ పండుగ సందర్భంగా నల్లమల దట్టమైన అడవిలో కృష్ణానది ఒడ్డున ఉన్న పాలంక వీరభద్రుడి క్షేత్రానికి భక్తులు పోటేత్తుతారు.
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పాలుట్ల సమీపంలో దట్టమైన నల్లమల అరణ్యంలోని లోయలో కొండ చరియ క్రింద వెలసి ఉన్న పురాతన పాలంక వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవార్లను దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఈ పాలంక క్షేత్రానికి సంతానం కలగని దంపతులు ఎక్కువ వస్తుంటారు. స్వామి అమ్మవారి గుడి పై భాగంలో ఉన్న కొండచరియ నుండి నీటి చుక్కలు పడుతుంటాయి..ఆ నీటి చుక్కలు సంతానం లేని దంపతుల అరచేతిలో పడితే సంతానం కలుగుతుందనేది అక్కడకు వచ్చే భక్తుల విశ్వాసం.
ఈ పుణ్య క్షేత్రాన్ని భక్తులకు సంతానం కలిగితే మగపిల్లలకు, పాలంకయ్య, పాలంవీరయ్య, వీరయ్య,వీరభద్రుడు, ఆడపిల్లలు అయితే పాలంకమ్మ, భద్రకాళి, భద్రమ్మ, సుభద్ర అని పేర్లు పెట్టుకొని ఉత్సవంవేళ వారి సంతానానికి పుట్టు వెంట్రుకలు తీయించడం భక్తులకు అనవాయితీ. ఈ పురాతన పాలంక క్షేత్రమును దర్శించుకునేందుకు ప్రకాశం, గుంటూరు, కర్నూలు, జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రం లోని మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల నుండి భక్తులు వేలాదిగా అక్కడికి చేరుకొని స్వామిని దర్షించుకొని పునీతులు అవుతారు. మీరు అటుగా వెళితే స్వామివారిని దర్శించుకోండి.