ఏడు కొండలు…ఈ పేరు వింటేనే భక్తజనుల వళ్లు పులకరిస్తుంది. భక్తి ఆవహిస్తుంది. శ్రీమహావిష్ణువు శయనించిన ఆదిశేషుని ఏడుపడగలే ఏడుకొండలు. కలియుగంలో స్వామివారికి ఎంతవిశిష్టత ఉందో ఆయన నివశించే ఈ సప్తగిరులకూ అంతే ప్రాముఖ్యత ఉంది. పచ్చని లోయలు, జలపాతాలు, అపార ఔషదాలు, కోటి తీర్థాలతో అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే గిరులు ఈ శేషాచల కొండలు. తిరుమల వెంకన్నకు శేషాచలం కొండలంటే చాలా ఇష్టం. ఈ ఏడుకొండల్లో ఒక్కో కొండకు ఒక్కో చరిత్ర ఉంది.. వైకుంఠంలో అలిగివచ్చిన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చిన వెంకన్న ఏడుకొండలపై కొలువైనాడని స్థలపురాణం చెబుతుంది. వైకుంఠంలో నిత్యం శ్రీవారి చుట్టూ ఉండే అనుచరులే… భూలోకంలోకి వచ్చి ఏడుకొండలుగా మారారని పురాణాలు చెబతున్నాయి. అందుకే ఆయన సప్తగిరివాసుడయ్యాడు. నంది వృషబాధ్రి అయ్యాడు, హనుమంతుడు అంజనాద్రిగా మారి స్వామిని సేవించుకుంటున్నాడు.
స్వామివారికి తొలిసారిగా తలనీలాలు సమర్పించిన నీల… నీలాద్రి కొండగా మారింది. శ్రీహరి వాహనమైన గరుత్మంతుడు గరుడాద్రిగా మారాడు. పాలకడలిలో స్వామికి శేషుడైన ఆదిశేషుడు శేషాద్రిగా మారి స్వామి సేవచేస్తున్నాడు. ఇక నారాయణాద్రి, వెంకటాద్రిలు శ్రీవారి రూపాలే. ఈ రెండు కొండలు జయ, విజయులకు ప్రతిరూపాలు. తిరుమల తిరుపతి లోగల ఏడు కొండలపై కొలువై వున్నాడు కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు . భక్తుల కోరికలను తీర్చే అభయ హస్తుడు శ్రీనివాసుడు . వెంకన్న కొలువై వున్న ఏడూ కొండలు కేవలం అద్రులు (కొండలు) మాత్రమే కాదు వాటి వెనుక కొన్ని గాధలు వున్నాయి . పూర్వం వృషభాసురుడు అనే శివ భక్తుడు భల గర్వితుడై సాక్షాత్ శ్రీహరితోనే యుద్దానికి తలపడ్డాడు . యుద్ధం లో చావుతప్పదని గ్రహించిన రక్కసుడు తమ చేతిలో మరణించడం నా మహద్భాగ్యం మీరు వున్న ఈ పర్వతానికి నా పేరు ప్రసాదించవలసింది అని శ్రీహరిని వేడుకున్నాడు . స్వామీ కరుణించి అతడు కోరిన వరాన్ని ఇచ్చి తరువాత వ్రుశాభాసురుడిని సంహరించాడు . ఆ ప్రకారం గా వృషభాద్రి అను పేరు వచ్చినది .
స్వామి వారికి తొలిసారిగా తన తల నీలాలు సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి. ఆమె భక్తి కి మెచ్చిన వెంకటేశ్వరుడు ఏడు కొండలలో ఒక కొండ కి ఆమె పేరుగా పేరుని పెట్టారు. తలనీలాలు అనే మాట కూడా ఆమె పేరు మీద రూపొందిందే.. శ్రీ మహా విష్ణువు హిరణ్యాక్షుని సంహరించిన తరువాత గరుత్మంతుని పిలిచి తన క్రీడాద్రిని తీసుకు రమ్మని ఆదేశిస్తాడు . ఆ ఆజ్ఞ మేరకు గరత్మంతుడు దానిని తెచ్చినందు వల్ల అది గరుడాద్రి గా ప్రసిద్ది చెందింది. మరో విధంగా కూడా చెబుతారు. దాయాదులైన కద్రువ పుత్రుల (నాగులు) ను సంహరించిన గరుత్మంతుడు పాపపరిహారార్ధం విష్ణువును గూర్చి తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమవగానే తనకు తిరిగి వైకుంఠం చేరే వరమివ్వమని ప్రార్ధించాడు. దానికి స్వామి… తానే ఏడుకొండల మీద వెలియనున్నానని తెలిపి ఆ వైనతేయుణ్ణి కూడా శైల రూపంలో అక్కడే ఉండమని ఆదేశించారట. అదే గరుడాచలం. వానర ప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న అంజనాదేవికి చాలాకాలం పాటు పిల్లలు పుట్టలేదట. సంతానం కోసం అంజనా దేవి వెంకటాచల క్షేత్రంలో తపస్సు ఆచరించింది . దాంతో ఆమె గర్భాన్ని దాల్చి అనంతరం బలశాలి, చిరంజీవి అయిన ఆంజనేయుడికి జన్మ నిచ్చింది . అందుకే ఈ పర్వతం అంజనాద్రి గా ప్రసిద్ది పొందింది .
విష్ణుదర్శనం కోసం నారాయణుడు అనే భక్తుడు స్వామి పుష్కరిణి తీరాన తపస్సు చేయడంతో అతడి పేరు మీదుగా ఈ పర్వతం నారాయణాద్రి గా ఖ్యాతి పొందింది . నారాయణ మహర్షి తన తపస్సుకి భంగం కలిగించని స్థలం ఎక్కడుందో చూపాల్సిందిగా బ్రహ్మదేవుణ్ణి కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ప్రదేశం చూపించాడట. అక్కడ స్వామి సాక్షాత్కారం పొందిన నారాయణ మహర్షి తాను తపమాచరించిన పవిత్రస్థలాన్ని శాశ్వతంగా తన పేరుతో పిలిచేలా వరం ఇవ్వమన్నాడట. ఆ విధంగా నారాయణమహర్షి తపస్సు చేసిన కొండకు నారాయణాద్రి అనే పేరు స్థిరమైందని చెబుతారు. కలియుగ దైవం వెలసిన తిరుమలగిరి..వేం అనగా సమస్త పాపాలను కటః అనగా దహించునది అంటే స్వామి వారి సమక్షంలో పాప రాశులను భస్మం చేసేది కావున ఈ క్షేత్రానికి వెంకటాచలం అని పేరు వచ్చింది .
ఏడుకొండలలో ప్రధానమైనది శేషాద్రి. ఓ సారి ఆది శేషుడికి వాయు దేవునికి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం రేగింది . నీకు శక్తి వుంటే నన్ను కదుల్చు అంటూ ఆదిశేషుడు వెంకటాచాలాన్ని చుట్టుకున్నాడు . వాయు దేవుడు అతడిని వేసిరి వేయగా పర్వతం తో పాటు అక్కడ వచ్చి పడతాడు . ఓడిపోయిన భాదతో వున్న ఆది శేషుడిని వెంకటేశ్వరస్వామి ఓదార్చుతూ ,నిన్ను ఆభరణం గా ధరిస్తాను . నీ పేరుతో ఈ క్షేత్రం ప్రసిద్ది పొందుతుంది అని వరం ఇచ్చాడు . దానితో ఈ కొండ శేషాద్రి గా ప్రసిద్ది పొందింది . ఈ విధం గా ఏడూ కొండలు ఏర్పడి స్వామి వారు వాటి మీద వసిస్తూ సదా తన భక్తులను కంటికి రెప్పలా కాపాడుతూ కలియుగ దైవం గా ప్రసిద్ది పొందాడు.