కొత్తగా పెళ్ళైన దంపతులకు ఆకాశంలో సప్తర్థి మండలంలో వున్న వశిష్టుని తారకకు ప్రక్కనే వెలుగుతుండే అరుంధతీ నక్షత్రాన్ని చూపిస్తారు. నూతన దంపతులకు ఈ అరుందతీ నక్షత్రాన్ని చూపించడం వెనుకున్న ఓ ప్రదాన ఉద్దేశ్యం ఉంది అదేంటంటే… వశిష్ట, అరుంధతీ వీరిద్దరూ పురాణాలలోని ఆదర్శ దంపతులు. కొత్తగా పెళ్ళైన దంపతులు కూడా వారిలాగా ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశ్యంతో మనవారు కొత్త జంటను ఆ నక్షత్రాల జంట వైపే చూడమని అంటారు. ఇది ఒక సాంప్రదాయమైంది. బ్రహ్మ దేవుడు సృష్టికార్యంలో తనకు సహాయంగా ఉండడం కోసం ఓ అందమైన కన్యను, అంతకు మించిన అందమైన వ్యక్తిని సృష్టిస్తాడు. ఆ కన్యపేరే సంధ్య…ఆమే తర్వాత అరుంధతిగా మారింది. ఆ అందమైన వ్యక్తే మన్మధుడు.
బ్రహ్మ మన్మధుడిని సృష్టించి ఓ 5 సమ్మోహన బాణాలనిచ్చాడు. వాటిని పరీక్షించాలని తలచి మన్మథుడు బ్రహ్మలోకంలోని వారిపైనే వాటిని ప్రయోగించాడు..దీంతో బ్రహ్మతో సహా అందరూ సంద్య పట్ల మోహానికి గురైయ్యారు. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన సరస్వతి ఈశ్వరుడిని ప్రార్థించగా ఈశ్వరుడు అక్కడకి ప్రత్యక్షమై పరిస్థితిని చక్కబరిచాడు. దీనంతటికీ కారణం మన్మథుడని తలచి బ్రహ్మ మన్మథున్ని ఈశ్వరుని నేత్రాగ్నిలో పడి భస్మమవుతావని శాపం ఇచ్చాడు. తనవల్లనే కదా ఇంతమంది నిగ్రహం కోల్పోయారనే అపరాధభావంతో సంధ్యా ఆత్మహత్య చేసుకోడానికి సిద్దమవుతున్న సమయంలో వశిష్ట మహాముని శివుడిని వేడుకోమని సంధ్యకు హితోపదేశం చేస్తాడు. తన తపస్సు తో శివుడిని ప్రత్యక్షం చేసుకున్న సంద్య శివుడి చేత రెండు వరాలు పొందుతుంది.
నా భర్త తప్ప పరపురుషుడెవరైనా నన్ను కామదృష్టిలో చూచినట్లయితే, వారు నపుంసకులుగా మారాలి, అంతేకాదు నేను పుట్టగానే అనేకమందికి మోహాన్ని కల్గించాను. కాబట్టి ఈ దేహం నశించిపోవాలి అని కోరింది. శివుడు తథాస్తూ అని మేధతిథి అనే మహర్షి ఓ యాగం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న యాగకుండంలో నీ శరీరాన్ని దగ్దం చేసుకుని, తిరిగి అదే అగ్నికుండం నుండి నీవు జన్మిస్తావు. నీ శరీరం నశించే సమయంలో నువ్వు ఎవరినైతే భర్తగా తలుస్తావో! అతడే నీ భర్త అవుతాడని చెప్పి మాయమవుతాడు శివుడు. సంస్కృత భాషలో అరుం= అగ్ని, ధతీ= ధరించినది ,అంటే అగ్ని నుంచి తిరిగి పుట్టింది కాబట్టి ఆమె అరుంధతీ అయ్యింది. ఆమె తాను మరణిస్తూ వశిస్ఠుడిని భర్తగా తలచింది. ఈ దంపతులకు పుట్టినవాడే శక్తీ. శక్తికి పరాశరుడు, పరాశరునకు వ్యాసుడు జన్మించారు.
అరుందతీ నక్షత్రాన్ని బేస్ గా చేసుకునే మనం ధృవ నక్షత్రాన్ని(Polestar) గుర్తిస్తాం. ఈ ధృవ నక్షత్రం ఎప్పుడూ ఉత్తర దిక్కునే సూచిస్తుంది కాబట్టి దీన్ని బట్టి మనం దిశలను గుర్తిస్తున్నాం. దీని ఆధారంగానే గతంలో నావికులు సముద్రయానం చేసేవారు.