భారతీయ సంప్రదాయంలో ఉపవాసాలకు ఎంతో ప్రాముఖ్యాన్ని ఇవ్వడం జరిగింది. మన అన్ని పురాణాలు, ఇతిహాసాలు అత్మజ్ఞానం కలగడానికి ఉపవాసాన్ని ఓ సాధనంగా సూచించాయి. పద్మపురాణం, విష్ణుపురాణం, భాగవతం మొదలైనవి ఏకాదశి వ్రతంలో (ఉపవాసాన్ని ఒకానొక రోజు చేయాలని) పాటించే ఉపవాసం ఎంతో శుభప్రదమని చెప్పినాయి. తిండి మానేసి కూర్చోవడమే ఉపవాసం అనుకోవడం పొరపాటు. ఉపవాసంతో కూడిన భగవధ్యానం సంపూర్ణ ఉపవాసంగా భావించవచ్చు. మనసు దుష్ట తలంపుల నుండి, ప్రాపంచిక ఆందోళనల నుండి విడివడి వండటం అవసరం. ఉపవాసం దీక్షలో మానసిక శుద్దత్వం ఓ నియమంగా చెప్పబడింది. అలా మానసిక పరిశుద్దత భక్తితో కూడిన ధ్యానం లేకుంటే ఉపవాసం అంటే తిండెలేక అలమటించడమే అవుతుంది.
ఏకాదశి రోజులలో నెలకు రెండు రోజులు పూర్తి ఉపవాసాన్ని పాటించాల్సిందిగా చెప్పడం జరిగింది. అలాగే షష్టి రోజులలో నెలకు రెండుసార్లు రోజులో కొంతభాగం ఉపవాసం పాటించాల్సిందిగా తెలుపబడింది. ఈ రోజులలో ఉపవాసాన్ని పాటించడంవల్ల భగవంతుడి కృపను నిస్సందేహంగా పొందవచ్చు. ఆధునిక సైన్స్ ప్రకారం ఉపవాసం శరీరానికి, మనస్సుకు ఎంతో ప్రయోజనకారి. ప్రార్ధనలు, ధ్యానం, శుభకరమైన మంచి ఆలోచన మనస్సును చైతన్యవంతం చేసి ఏకాగ్రత, ఆత్మస్థైర్యమనే శక్తిని పెంచుతాయి.
శరీరాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నట్లయితే ఉపవాసం రక్తాన్ని, జీర్ణవ్యవస్థని శుద్దచేస్తుంది. ఎప్పుడు కడుపు నిండా తిండి ఉంటే ప్రేగులు ఎప్పుడూ నిండుగా ఉంటాయి. జీర్ణవ్యవస్థకు కాస్త విరామం కలిగించడం కోసం ఉపవాసాలు ఎంతో సహకరిస్తాయి. అలా శరీరానికి శుద్ధికూడా ఉపవాసం కలిగిస్తుంది. అలా శరీరంలో అవసరానికి మించి వున్న కొవ్వు, ఇతరాలు ఉపవాసాలవల్ల తొలగిపోతాయి. ఇలా అనేక విధాలుగా ఉపవాసం దీక్షలు శరీరానికి, మనస్సుకు ఎంతో క్షేమం కలిగిస్తాయి.