సాధారణంగా మనమందరం భోజనం చేసే సమయంలో కనీసం ఒక గ్లాసెడు నీరు దగ్గర పెట్టుకొని మాత్రమే భోజనం చేస్తాం. ఏ ఆహారం తింటున్నప్పటికి ఒక గ్లాసెడు నీరు పక్కన వుండటం తప్పని సరి. ఏ హోటల్ కి వెళ్ళినా సరే పదార్ధాలు ఆర్డరివ్వకముందే, సర్వర్ ఒక గ్లాసెడు నీరు తెచ్చి పెడతాడు. అయితే, ఘన పదార్ధాలు తినేటపుడు, లేదా తిన్న వెంటనే నీరు తాగడం సరికాదంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ రకంగా నీరు తాగితే, అది జీర్ణ వ్యవస్ధకు హాని కలిగిస్తుందని, జీర్ణ శక్తిని కోల్పోయేలా చేస్తుందని వీరంటారు. మరి నీరు ఎప్పుడు తాగాలి? భోజనానికి సరిగ్గా అరగంట ముందు నీరు తాగితే, మీరు తినే ఘన ఆహారాలకు తాగిన నీరు జీర్ణక్రియకు సహకరిస్తుంది.
లేదా భోజనం చేసిన రెండు గంటల తర్వాత మాత్రమే నీరు తాగాలని, ఈ రకంగా తాగే నీరు, పొట్టలో జీర్ణమైన ఆహారాన్ని, రసాలను తొలగించి శుభ్రం చేయటానికి ఉపయోగపడుతుందని, ఈ రకంగా తాగే నీరు జీర్ణ క్రియకు ఏ మాత్రం అడ్డంకి కాదని పోషకాహార నిపుణులు చెపుతున్నారు. నీటిని అవసరం లేని సమయాలలో శరీరానికి అందించితే అది గ్యాస్ సమస్యలకు కూడా దోవతీయవచ్చంటున్నారు. రోజు మొత్తం మీద శరీరానికి నీటిని ఎలా అందించాలి? ఉదయం లేవగానే కనీసం ఒక లీటరు నీటిని తాగాలి.
మధ్యాహ్నం లంచ్ సమయంవరకు నిర్దేశిత కాల వ్యవధితో మరో లీటర్ తాగాలి. భోజనం చేసిన రెండు గంటల తర్వాత మొదలుపెట్టి సాయంకాలం స్నాక్స్ లేదా చిరుతిండి వరకు మరో లీటరు నీరు అప్పుడపుడూ, ఆపై రాత్రి డిన్నర్ లోపుగా మరో లీటర్ అంచెలవారీగా తాగితే మొత్తంగా నాలుగు లీటర్ల నీరు ప్రతిరోజూ శరీరానికి అందించినట్లవుతుందని. ఈ క్రమంలో తీసుకునే నీరు తిన్న ఆహారం బాగా జీర్ణమవటానికి, రక్తంలో కలవటానికి, మరుసటిరోజు మలబద్ధకం ఏర్పడకుండా వుండటానికి సహకరిస్తుందని చెపుతున్నారు.