నేటి తరుణంలో మన జీవన విధానంలో మనం అనుసరిస్తున్న అలవాట్లు, చేస్తున్న పొరపాట్ల వల్ల మనకు అనేక రకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటిల్లో స్థూలకాయం, గుండె జబ్బులు, డయాబెటిస్ లు చాలా ముఖ్యమైనవి. ఇవే కాదు, మనం చేస్తున్న అనేక పనుల వల్ల కూడా మనకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అదీ ముఖ్యంగా భోజనం చేసిన తరువాత మనం పాటిస్తున్న కొన్ని అలవాట్లు మనకు చేటు చేస్తున్నాయి. వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం. భోజనం చేసిన తరువాత పండ్లను తినరాదు. తింటే అవి జీర్ణాశయానికి చేరి అటునుంచి పేగుల్లోకి వెళ్లేందుకు చాలా సమయం పడుతుంది. దీంతో గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణం కాదు. కనుక భోజనం చేసిన వెంటనే పండ్లను తినరాదు. కావాలంటే ఒక గంటన్నర సమయం దాటిన తరువాత తినవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు.
భోజనం ముగిసిన వెంటనే స్నానం చేయరాదు. అలా చేస్తే ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో రక్తం అన్ని భాగాలకు సరఫరా అవుతుంది. దీంతో జీర్ణాశయానికి రక్త సరఫరా తగ్గుతుంది. ఫలితంగా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు. దీనికి తోడు గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి. భోజనం చేసిన వెంటనే చేయకూడని మరొక పని టీ, కాఫీ తాగడం. అవి అప్పుడు తాగితే జీర్ణాశయం పనితీరు దెబ్బ తింటుంది. అజీర్ణం, గ్యాస్, అసిడిటీ సమస్యలు ఉత్పన్నమవుతాయి. తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించలేదు. ఆహారం తీసుకున్న వెంటనే నిద్రించరాదు. అలా చేస్తే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. గ్యాస్ వస్తుంది. స్థూలకాయం సమస్య వస్తుంది.
ఈత కొట్టడం, వ్యాయమం చేయడం, పనులు చేయడం వంటి వాటిని భోజనం చేశాక చేయరాదు. కనీసం 30 నుంచి 60 నిమిషాల గ్యాప్ తరువాతే ఆ పనులు చేయాలి. లేదంటే జీర్ణాశయంలో గ్యాస్ పెద్ద ఎత్తున పేరుకుపోతుంది. అది ఇబ్బందిని కలిగిస్తుంది. చాలా మంది భోజనం చేశాక బెల్ట్ టైట్ అయిందని చెప్పి దాన్ని లూజ్ చేస్తారు. దీంతో సౌకర్యంగా ఉంటుందని అనుకుంటారు. కానీ అలా చేయరాదు. ఎందుకంటే అప్పటి వరకు టైట్గా ఉన్న పేగులు లూజ్ అయ్యే సరికి చుట్టుకున్నట్టు అవుతాయి. వాటి కదలిక సరిగ్గా ఉండదు. భోజనం చేసిన వెంటనే పొగ తాగరాదు. ఎందుకంటే మిగిలిన సమయాల్లోకన్నా భోజనం చేశాక ఒక సిగరెట్ తాగితే అది 10 సిగరెట్లకు సమానమట. కనుక ఆ పని చేయరాదు.