పొట్ట దగ్గరి కొవ్వును, అధిక బరువును తగ్గించుకోవడం నిజంగా కష్టమే. అందుకు గాను ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. రోజూ వ్యాయామం చేయాలి. వేళకు నిద్రించాలి, భోజనం చేయాలి. రోజూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. అయితే కింద తెలిపిన విధంగా పలు మూలికలను ఉపయోగిస్తే పొట్ట దగ్గరి కొవ్వును, అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే..
* అధిక బరువును, పొట్ట దగ్గరి కొవ్వును కరిగించడంలో నల్ల జీలకర్ర బాగా ఉపయోగపడుతుంది. దీన్నే కాలోంజి అంటారు. స్థూలకాయన్ని తగ్గించడంలో ఇవి అమోఘంగా పనిచేస్తాయి. రోజూ ఒక పాత్రలో కొన్ని నల్ల జీలకర్ర గింజలను వేసి బాగా మరిగించి ఆ నీటిని తాగుతుండాలి. దీని వల్ల అధిక బరువు, పొట్ట దగ్గరి కొవ్వు తగ్గుతాయి.
* ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ.. ఈ మూడింటికి చెందిన చూర్ణాన్ని సమపాళ్లలో కలిపి త్రిఫల చూర్ణాన్ని తయారు చేస్తారు. త్రిఫల చూర్ణం అధిక బరువును తగ్గిస్తుంది. దీన్ని రోజూ రాత్రి ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ మోతాదులో కలిపి తీసుకోవాలి. దీని వల్ల పొట్ట దగ్గరి కొవ్వూ కూడా తగ్గుతుంది. మలబద్దకం నుంచి బయట పడవచ్చు.
* రోజూ రాత్రి ఒక గ్లాస్ నీటిలో 1 టీస్పూన్ మెంతులను నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే ఆ నీటిని తాగి ఆ మెంతులను తినాలి. లేదా నీటిలో మెంతులను మరిగించి ఆ నీటిని కూడా తాగవచ్చు. దీంతో అధిక బరువు తగ్గుతారు. షుగర్ అదుపులోకి వస్తుంది.
* అధిక బరువు తగ్గేందుకు పునర్నవ మొక్క కూడా పనిచేస్తుంది. దీని చూర్ణాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని నీళ్లలో వేసి మరిగించి ఒక కప్పు మోతాదులో రోజుకు ఒకసారి తాగాలి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
* ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో చిన్న దాల్చిన చెక్క ముక్కను వేసి బాగా మరిగించాలి. ఆ నీటిని గోరు వెచ్చగా ఉండగానే ఒక కప్పు మోతాదులో తాగేయాలి. అందులో తేనె కూడా కలుపుకోవచ్చు. రోజూ రాత్రి నిద్రకు ముందు ఈ మిశ్రమాన్ని తాగాలి. అధిక బరువు తగ్గుతారు.