ప్రధాని మోడీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ఏ ముహుర్తాన అయితే చెప్పారో గానీ నల్ల కుబేరులంతా తమ బ్లాక్ మనీని వైట్గా మార్చుకున్నారు. అవేవీ పట్టని సాధారణ జనాలు మాత్రం తమ వద్ద ఉన్న కొద్దో గొప్పో సొమ్మును వెంటనే డిపాజిట్ చేసుకునేందుకు బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద బారులు తీరారు. ఇదంతా గతంలోనే జరిగింది. నల్ల ధనం అరికట్టాలని, నకిలీ నోట్లకు చెక్ పెట్టాలనే ప్రధాన ఉద్దేశంతో మోడీ ఆయా నోట్లను రద్దు చేయగా, దీనిపై అన్ని వర్గాల్లోనూ మిశ్రమ స్పందన లభించింది. కొందరు మోడీ భలేగా చేశారని మెచ్చుకుంటుంటే, ఇంకొందరు మాత్రం నోట్లను రద్దు చేసినంత మాత్రాన నకిలీ నోట్ల ప్రింటింగ్ ఆగుతుందా..? కొద్ది రోజులు ఆగితే కొత్త నోట్లకు కూడా నకిలీవి వస్తాయి, అంత మాత్రానికి నోట్లను రద్దు చేయడం ఎందుకు అని ప్రశ్నించారు.
అయితే ఏది ఏమైనా ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన రూ.500 నోట్లతోపాటు ఇతర కొత్త నోట్లను మాత్రం నకిలీగా ముద్రించడానికి ఎవరికీ వీలు కాదట. అంతటి పకడ్బందీ సెక్యూరిటీ ఫీచర్లతో ఆయా నోట్లను ప్రభుత్వం ప్రింట్ చేసింది. మరి వాటిలో ఉన్న సెక్యూరిటీ ఫీచర్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. నోటుపై ఎడమ భాగంలో ఆ నోటు విలువను తెలిపే సంఖ్య తెల్లని అక్షరాల్లో ప్రింట్ చేసి ఉంటుంది. నోటును జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ విషయం తెలుస్తుంది. నోటుకు ఎడమభాగంలోనే ఆ నోటు విలువను తెలిపే సంఖ్య బయటకు కనబడని విధంగా లేటెంట్ ఇమేజ్ రూపంలో ఉంటుంది. దాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. అప్పుడే నోటు సంఖ్య తెలుస్తుంది. నోటుపై దేవనాగరి లిపిలో ఆ నోటు విలువను తెలిపే సంఖ్యను ప్రింట్ చేశారు.
ఇంతకు ముందు ఉన్న నోట్లపై మహాత్మా గాంధీ బొమ్మ ఓ వైపుకు చూస్తూ ఉంటే, ఇప్పుడు మరో వైపుకు ఉంది. అదేవిధంగా ఆ బొమ్మ సైజ్ను కూడా తగ్గించారు. నోటుకు మధ్యభాగంలో కాకుండా కొంచెం కుడివైపుకు ఉండేలా దాని లోపలి నుంచి ఓ సెక్యూరిటీ త్రెడ్ను ఏర్పాటు చేశారు. అది గ్రీన్ నుంచి బ్లూ కలర్కు మారుతూ ఉంటుంది. గ్యారంటీ క్లాజ్, ఆర్బీఐ గవర్నర్ సంతకం, ప్రామిస్ క్లాజ్, ఆర్బీఐ చిహ్నం వంటి వాటి స్థానాలను కుడి వైపుకు మార్చారు. నోటుపై ఉండే ఖాళీ తెల్లని ప్రదేశంలో గాంధీ, నోటు విలువను తెలిపే సంఖ్యకు చెందిన వాటర్ మార్క్స్ ఉంటాయి. నోటు ఎడమ భాగంలో పై వైపున, కుడి భాగంలో కింది వైపున ఆ నోటు సీరియల్ నంబర్ చిన్న అంకెలతో మొదలై క్రమంగా పెద్ద సైజ్ ఉన్న అంకెలతో ముగుస్తుంది. నోటుపై ఆ నోటు విలువను తెలిపే సంఖ్య గ్రీన్ కలర్ నుంచి బ్లూ కలర్కు మారుతూ ఉంటుంది.
నోటు కుడిభాగంలో చివరన అశోక స్థూప చిహ్నం ఉంటుంది. అశోక చిహ్నంపైనే నోటు విలువను తెలిపే సంఖ్య ఉబ్బెత్తుగా ప్రింట్ చేయబడి ఉంటుంది. నోటుకు కుడి, ఎడమ భాగాల్లో చివరన ఉబ్బెత్తుగా ప్రింట్ చేయబడిన గీతలు ఉంటాయి. ఇవి నోటు, నోటుకూ మారుతాయి. నోటు విలువ ఎంత ఉందో దాన్ని బట్టి గీతలు ఉంటాయి. నోటు వెనుక భాగంలో ఎడమ వైపు దాన్ని ప్రింట్ చేయబడిన సంవత్సరం ఉంటుంది. నోటు వెనుక వైపు ఎడమ భాగంలో కింద స్వచ్ఛ భారత్ చిహ్నం ఉంటుంది. నోటు వెనుక భాగంలో ఎడమ వైపుగా వివిధ భాషలకు చెందిన అక్షరాలు ఉంటాయి. ఇవి నోటు విలువను తెలియజేస్తాయి. నోటు వెనుక వైపు ఎక్కువ భాగంలో ఎర్రకోట బొమ్మ ఉంటుంది. దానిపై జాతీయ జెండా ఎగురుతూ ఉంటుంది. నోటు వెనుక భాగంలో కుడి వైపు పైన దేవనాగరి లిపిలో రాయబడ్డ అక్షరాలు ఉంటాయి. అవి నోటు విలువను తెలియజేస్తాయి.