నిజమే. స్వర్గీయ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పూర్తి పేరు ముత్తువేల్ కరుణానిధి, వారి కుమారుడు ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి పేరు ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్.. కరుణానిధి ఇంటిపేరు వారి తండ్రిదైతే , స్టాలిన్ ఇంటిపేరు వారి తండ్రి గారైన కరుణానిధి గారిది.. ఇలా తమిళనాడు లో ఇంటిపేరుగా తండ్రిపేరు పెట్టుకోవడమనే పద్ధతి పెరియార్ అనే పెద్దాయన కుల వివక్ష కు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఫలితంగా రూపుదిద్దుకుంది.. అంతకుముందు తమిళులు తమ కులాన్ని ఇంటిపేరుగా పెట్టుకునేవారుట , ఇక్కడ కులం అంటే వారు చేసే కులవృత్తుల మూలంగా రూపుదిద్దుకున్నది..
కులానికి బదులుగా మన పల్లెటూళ్లలో చెప్పుకుంటారు కదా, పలానా వెంకన్న గారి అబ్బాయి అనో, సుబ్బమ్మ కొడుకు అనో చెప్పుకుంటారు కదా, అలాగే వీరు కులాన్ని వదిలేసి తండ్రి పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారు .. ఉత్తరాదిలో మాత్రం కులాన్ని ప్రతిబింబించేలా ఇంటిపేరు అసలు పేరు చివర పెట్టుకుంటారు, ఉదాహరణకు మిశ్రా అంటే బ్రాహ్మణులు , ఇలా ఉత్తరాది వారు మాత్రం కులాన్ని పేరు ప్రక్కనే పెట్టుకుంటారు.. మరి మన తెలుగు వారి సంగతి వేరే, అధిక శాతం మంది పుట్టిన ఊరుని ఇంటిపేరుగా పెట్టుకుంటారు , కులవృత్తుల్ని ప్రతిబింబించేలా కొన్ని ఇంటిపేర్లు కూడా లేకపోలేదు..
అయితే ఈ సందర్భంగా ఒక ఆసక్తికర సంఘటన చెప్పదలుచుకున్నాను, ప్రముఖ నటి సంయుక్త మేనన్ తన ఇంటిపేరు అయిన మేనన్ ని తొలిగిస్తున్నట్లు ప్రకటించారు.. ఆమె చిన్నతనంలో తన తండ్రి దగ్గర ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.. ఇది మార్పు కి సంకేతం… అలాగే ప్రముఖ దర్శకులు రాజమౌళి, సంగీత దర్శకులు కీరవాణి కూడా తమ ఇంటిపేరు అయిన కోడూరిని తొలగించుకున్నారు.. ఇక్కడ నేను తమిళులకు అసలు కులతత్వం లేదని చెప్పటం లేదు, అయితే వారు ఆ తరహాగా ఇంటిపేరు కి ముందు తండ్రిపేరు జోడించుకోవడానికి గల పలు కారణాల్లో ముఖ్యమైన ఒక కారణాన్ని ఉదాహరించాను..ఇప్పటికీ దేశంలో అత్యధిక పరువు హత్యలు జరిగే రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటిగా ఉంది..
అలాగే పెరియార్ ని కూడా ఒక మహాత్ముడు అని నేను చెప్పటంలేదు, అయన ఒక మంచి ఆశయంతోనే ఉద్యమాన్ని ఆరంభించినా కూడా , అది రాజకీయాలు, నాయకుల ప్రభావంతో తప్పుదారి పట్టి ఉండవచ్చు.. చివరి రోజుల్లో పెరియార్ ఆ విషయాన్నీ గ్రహించారని ఎక్కడో చదివాను .. బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ 21 వ శతాబ్దంలో ఉన్న కులపిచ్చి, 20 వ శతాబ్దాన్ని మించి ఉందనిపిస్తుంది.. ముఖ్యంగా 2000 తర్వాత జన్మించిన యువతలో , ఉన్నత విద్యావంతుల కుటుంబాలలో జన్మించినా కూడా ఈ జాడ్యం వదలట్లేదు, తల్లిదండ్రులు వారి పెంపకం, సామాజిక పరిస్థితులు.. ఈ సామాజిక మాయరోగానికి మందులేదు..