హిందూ పురాణాల్లో ఒకటైన రామాయణం గురించి దాదాపు ప్రతి ఒక్క హిందువుకి, ఆ మాట కొస్తే దాదాపు అందరికీ తెలుసు. రాముడి జననం, రాక్షసులను సంహరించడం, సీతను పరిణయమాడడం, అడవులకు వెళ్లి వనవాసం చేయడం, రావణుడు సీతను ఎత్తుకెళ్లడం, రాముడు రావణున్ని సంహరించడం… ఇలా అనేక కాండలలో రామాయణాన్ని వాల్మీకి కవి అద్భుతంగా రచించి భక్తులకు ఆ గ్రంథం పవిత్రతను తెలియజేశాడు. అయితే రాముడు, సీత, లక్ష్మణులు తమ అంత్య కాలంలో ఈ లోకాన్ని ఎలా విడిచిపెట్టి వెళ్లారో మాత్రం దాదాపుగా చాలా కొద్ది మందికే తెలుసు. ఈ క్రమంలో అసలు వారు తమ అంత్యకాలంలో తనువులు ఎలా చాలించారో ఇప్పుడు తెలుసుకుందాం.
రావణాసురుడి చెర నుంచి సీతమ్మను విడిపించిన రాముడు సీతకు అగ్నిప్రవేశ పరీక్ష పెడతాడు. లోకం కోసం రాముడు అంతటి కఠిన పరీక్ష పెట్టినా అందులో సీతమ్మే గెలుస్తుంది. అయితే ఆ సందర్భంలోనే కాక రాముడు సీతాదేవిని మరోమారు అగ్ని ప్రవేశం చేయమంటాడు. అదెప్పుడంటే… మొదటిసారి అగ్నిప్రవేశం చేసిన తరువాత సీతను తీసుకువచ్చి రాజ్యమేలుతున్న సమయంలో ఓ చాకలివాని మాటలకు చింతించి సీతను వాల్మీకి ఆశ్రమంలో రాముడు వదిలిపెడతాడు. అనంతరం కొన్నేళ్లకు రాముడు సీతను అయోధ్యకు తీసుకువచ్చేందుకు ఉపక్రమిస్తాడు.
అయితే ఆ సందర్భంలోనూ రాముడు సీతకు అగ్నిప్రవేశం పెడతాడు. దీంతో సీతాదేవి అమితంగా దుఃఖించి ఆ పరీక్షను తిరస్కరిస్తుంది. అదే సమయంలో తన తల్లి భూదేవిని ప్రార్థిస్తూ తనను ఈ లోకం నుంచి తీసుకువెళ్లమని వేడుకుంటుంది. దీంతో భూదేవి ఒక్కసారిగా భూమి చీల్చుకుని పైకి వచ్చి సీతను తనతో తీసుకెళ్తుంది. అలా సీత తన తనువు చాలిస్తుంది. కాగా ప్రస్తుత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్, వారణాసి ప్రాంతాలను కలుపుతూ ఉండే జుంగిగంజ్ అనే రైల్వే స్టేషన్ వద్ద సీతామర్హి అనే ఓ ప్రాంతం ఉంది. ఇదే ప్రాంతంలో ఒకప్పుడు సీతాదేవి తన తల్లి భూదేవితో కలిసి వెళ్లిపోయిందని చెబుతారు.
సీత వెళ్లిపోయాక రాముడు రాజ్యాన్ని పాలిస్తూ లవ, కుశులకు అన్నీ నేర్పిస్తాడు. వారు రాజులుగా రాజ్యాన్ని పాలించే అర్హత వచ్చాక, ఒక రోజు రాముడి వద్దకు యమధర్మ రాజు ఒక రుషి వేషంలో వస్తాడు. అలా వచ్చీ రాగానే రామున్ని తీసుకుని ఆ రుషి కోటలో ఉన్న ఓ గదిలోకి వెళ్తాడు. ఆ గదికి కాపలాగా లక్ష్మణున్ని నియమిస్తారు. లోపలికి ఎవరినీ అనుమతించవద్దని వారు లక్ష్మణునికి చెబుతారు. అనంతరం ఆ రుషి (యమ ధర్మరాజు) రాముడితో తనువు చాలించాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతాడు. దీనికి అంగీకరించిన రాముడు ఓ శుభ ముహూర్తాన అయోధ్య సమీపంలో ఉన్న సరయూ నదిలోకి వెళ్లి అంతర్థానమవుతాడు. అక్కడ రాముడి అవతారం నుంచి మళ్లీ విష్ణువు అవతారంలోకి మారిపోతాడు.
రాముడి అనంతరం లక్ష్మణుడు కూడా అదే నదిలో తన తనువు చాలిస్తాడు. తన నిజరూపమైన శేషనాగు అవతారంలోకి అతను మారిపోతాడు. అలా రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురూ తమ అంత్యకాలంలో లోకాన్ని విడిచి వెళ్లిపోతారు. ఈ కథ గురించి‘పద్మ పురాణంలో వివరించబడింది.