Tomato Red Chilli Pickle : ట‌మాటా పండు మిర్చి నిల్వ ప‌చ్చ‌డిని ఇలా పెట్టాలి.. ఒక్క‌సారి రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Tomato Red Chilli Pickle : మ‌నం సంవ‌త్స‌రానికి స‌రిప‌డా ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేసుకుని నిల్వ చేసి తింటూ ఉంటాం. ఇలా త‌యారు చేసుకోద‌గిన ప‌చ్చ‌ళ్ల‌ల్లో ట‌మాట పండుమిర్చి ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. శివ‌రాత్రి వెళ్లిన త‌రువాత వ‌చ్చే ట‌మాటాల‌తో ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేస్తారు. ట‌మాట పండుమిర్చి ప‌చ్చ‌డిని రుచిగా, మొద‌ట‌సారి చేసే వారు సుల‌భంగా చేసుకోగ‌లిగేలా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాట పండుమిర్చి ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – పావు క‌ప్పు, పుల్ల‌టి నాటు ట‌మాటాలు – 500 గ్రాములు, ఉప్పు – 2 టేబుల్ స్పూన్స్, ప‌సుపు – ఒక టేబుల్ స్పూన్, చింత‌పండు – నిమ్మ‌కాయంత‌, పండుమిర్చి – అర‌కిలో, వెల్లుల్లి రెబ్బ‌లు – 10, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్.

Tomato Red Chilli Pickle tastes better with rice recipe is here
Tomato Red Chilli Pickle

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఎండుమిర్చి – 2.

ట‌మాట పండుమిర్చి ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌డానికి ముందు రోజే ట‌మాటాల‌ను శుబ్రంగా క‌డిగి ముక్క‌లుగా క‌ట్ చేయాలి. త‌రువాత వీటిని ఆర‌బెట్టాలి. అలాగే పండుమిర్చిని తొడిమ‌లు తీయ‌కుండా క‌డిగి ఆర‌బెట్టాలి. పండుమిర్చి చ‌క్క‌గా ఆరిన తుడిచి తొడిమ‌లు తీసి పక్క‌కు ఉంచాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ట‌మాటాలు, ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత వీటిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌ల‌ను మెత్త‌గా మ‌గ్గించాలి. ట‌మాట ముక్క‌లు మ‌గ్గిన త‌రువాత చింత‌పండు వేసి క‌ల‌పాలి. ట‌మాటాలు పూర్తిగా మ‌గ్గిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత వీటిపై మూత పెట్ట‌కుండా చ‌ల్లార‌నివ్వాలి. ఇప్పుడు జార్ లో పండుమిర్చి, వెల్లుల్లి రెబ్బ‌లు, జీల‌క‌ర్ర వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఉడికించిన ట‌మాటాలు వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ట‌మాట పండుమిర్చి ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది.

దీనిని గాజు సీసాలో లేదా జాడిలో నిల్వ చేసుకోవాలి. గాలి త‌గ‌ల‌కుండా, త‌డి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల ఈ ప‌చ్చ‌డి సంవ‌త్స‌ర‌మంతా తాజాగా ఉంటుంది. మ‌న‌కు కావ‌ల్సినప్పుడు ఈ ప‌చ్చ‌డిని తాళింపు చేసుకోవ‌చ్చు. ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు ప‌దార్థాలు ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి. తాళింపు వేగిన త‌రువాత ప‌చ్చ‌డి వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ట‌మాట పండుమిర్చి ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. ఈ ప‌చ్చ‌డిని అన్నం, నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts