Veg Masala Curry : వెజ్ మ‌సాలా క‌ర్రీని ఇలా చేయండి.. అన్నం, రోటీ.. వేటిలోకి అయినా స‌రే బాగుంటుంది..

Veg Masala Curry : మ‌న‌కు విందుల్లో, క‌ర్రీ పాయింట్ ల‌లో ఎక్కువ‌గా స‌ర్వ్ చేసే కూర‌ల్లో వెజ్ మ‌సాలా క‌ర్రీ ఒక‌టి. కూర‌గాయ ముక్క‌ల‌తో చేసే ఈ వెజ్ మ‌సాలా క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ కూర‌ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వంట‌రాని వారు, మొద‌టిసారి చేసే వారు కూడా ఈ కూర‌ను తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ వెజ్ మ‌సాలా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

వెజ్ మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన బంగాళాదుంప‌లు – 2, త‌రిగిన బీన్స్ – 10, త‌రిగిన క్యారెట్ – 1, ఉడికించిన ప‌చ్చి బ‌ఠాణీ – అర క‌ప్పు, త‌రిగిన ట‌మాటాలు – 3, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, కారం – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, యాల‌కులు – 2, ల‌వంగాలు – 2, బిర్యానీ ఆకు – 1.

Veg Masala Curry recipe in telugu tastes better with rice or roti
Veg Masala Curry

మ‌సాలా పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ధ‌నియాలు – 2 టేబుల్ స్పూన్స్, సాజీరా – ఒక టీ స్పూన్, ల‌వంగాలు – 10, యాల‌కులు – 7, దాల్చిన చెక్క – 2 ఇంచుల ముక్క‌.

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

జీడిప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, సార ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, గ‌స‌గ‌సాలు – ఒక టేబుల్ స్పూన్.

వెజ్ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో మ‌సాలా పొడికి కావ‌ల్సిన ప‌దార్థాలు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ పొడిని ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే జార్ లో మ‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు, నీళ్లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక దాల్చిన చెక్క‌, ల‌వంగాలు, యాల‌కులు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత కూర‌గాయ ముక్క‌లు, ప‌సుపు, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ కూరగాయ ముక్క‌ల‌ను ఉడికించాలి. కూర‌గాయ ముక్క‌లు ఉడికిన త‌రువాత ట‌మాట ముక్క‌లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు మ‌గ్గించాలి.

ట‌మాట ముక్క‌లు మెత్త‌బ‌డిన త‌రువాత కారం, ధ‌నియాల పొడి, మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పేస్ట్ వేసి క‌ల‌పాలి. త‌రువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత ఉడికించిన ప‌చ్చి బ‌ఠాణీ, క‌సూరి మెంతి, కొత్తిమీర‌, మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పొడి ఒక టేబుల్ స్పూన్ వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని పులావ్, బిర్యానీ, రోటి, పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. పులావ్, బిర్యానీ వంటి వంట‌కాలు త‌యారు చేసిన‌ప్పుడు ఈ విధంగా వెజ్ మ‌సాలా క‌ర్రీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts