Covid Patients Diet : కరోనా సోకిన వారికి సహజంగానే పలు లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని లక్షణాలు అందరిలోనూ ఉండకపోవచ్చు. కానీ కొన్ని కామన్ లక్షణాలు మాత్రం కోవిడ్ బాధితుల్లో కచ్చితంగా కనిపిస్తాయి. ఈ క్రమంలోనే కరోనా సోకిన వారిలో దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, ఆకలి లేకపోవడం, రుచి లేకపోవడం, అసిడిటీ, విరేచనాలు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో సమస్యలు.. వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ లక్షణాలు ఉంటే వెంటనే కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలి. కరోనా ఉందని తేలితే డాక్టర్ సూచన మేరకు చికిత్స తీసుకోవాలి. చాలా మందికి కరోనా ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటేనే నయమవుతుంది. కనుక ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
కరోనా వచ్చిన వారు ప్రశాంతంగా ఉండాలి. తమకు కరోనా సోకిందనే భయాన్ని వీడాలి. అన్ని పోషకాలు ఉండే పౌష్టికాహారాన్ని రోజూ తీసుకోవాలి. దీంతో కోవిడ్ నుంచి త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. కోవిడ్ బాధితులు తాము తీసుకునే ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్లు, ప్రొ బయోటిక్స్ ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్లు ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా ద్రవాహారం తీసుకోవాలి. దీంతో త్వరగా కోవిడ్ నుంచి కోలుకుంటారు.
కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకునే ఆహారాలను తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ క్రమంలోనే పండ్లను, నట్స్, కోడిగుడ్లను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే ఆహారాలను కచ్చితంగా తీసుకోవాలి.
సూప్స్, మసాలా దినుసులను ఎక్కువగా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో శరీరం ఇన్ఫెక్షన్పై పోరాటం చేస్తుంది. వైరస్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల కోవిడ్ నుంచి త్వరగా కోలుకుంటారు. ముఖ్యంగా ఉసిరికాయ జ్యూస్ను రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగాలి. ఉసిరికాయల్లో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. అలాగే శరీరంలో ద్రవాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు ద్రవాలను ఎక్కువగా తాగాలి. దీంతోనూ త్వరగా కోవిడ్ నుంచి కోలుకోవచ్చు.
ఇక కొబ్బరినీళ్లు, అరటి పండ్లను కూడా ఎక్కువగానే తీసుకోవాలి. ఇవి శక్తిని అందిస్తాయి. త్వరగా కోలుకునేలా చేస్తాయి. ప్రోటీన్ల విషయానికి వస్తే.. కోడిగుడ్లు, పెరుగు, పాలు, సోయా పాలు, పనీర్, చికెన్, చేపలు, పప్పు దినుసులను ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి అయితే ఉసిరికాయ, నిమ్మ, నారింజ, జామ పండ్లలో అధికంగా ఉంటుంది. వీటిని రోజూ తీసుకోవాలి. జింక్ ఎక్కువగా ఉండే శనగలు, జీడిపప్పు, కోడిగుడ్లు, పాలకూర, పప్పు దినుసులు, పాలను కూడా రోజూ తీసుకోవాలి. అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే వాల్ నట్స్, చేపలు, అవిసె గింజలు, చియా విత్తనాలు, పైన్ నట్స్ను తీసుకోవడం వల్ల కూడా కోవిడ్ నుంచి త్వరగా కోలుకుంటారు.
రోజూ కనీసం 2 నుంచి 3 లీటర్ల మేర నీటిని తాగాలి. దీని వల్ల శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. సీజనల్ పండ్లను, కూరగాయలను కూడా రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. దీంతో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ అధికంగా లభిస్తాయి. ఇవన్నీ రోగ నిరోధక శక్తిని పెంచి త్వరగా కోలుకునేలా చేస్తాయి.
ఇక కోవిడ్ నుంచి కోలుకునేవరకు వేపుళ్లు, శీతల పానీయాలు, ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, స్వీట్లను తీసుకోకూడదు. పప్పు దినుసులు, కూరగాయలతో తయారు చేసే కిచ్డీని వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి. నెయ్యి, పెరుగు, నిమ్మరసంలను రోజూ తీసుకోవాలి. ఎక్కువగా సూప్స్ తాగాలి. కీరదోస, టమాటా, పాలకూర, వెల్లుల్లి వంటి వాటిని తీసుకోవాలి. మిరియాలు, క్యారెట్లు, బీట్రూట్ను కూడా తీసుకోవాలి.
పైన తెలిపిన విధంగా జాగ్రత్తలను పాటిస్తూ ఆహారాలను రోజూ తీసుకుంటే కోవిడ్ నుంచి త్వరగా కోలుకుంటారు. కనీసం 14 రోజులు పట్టే సమయం సగానికి సగం తగ్గుతుంది. 7 రోజుల్లోనే సాధారణ జీవితం గడపవచ్చు.