ఆయనో కార్పొరేట్ సంస్థ వైస్ ప్రెసిడెంట్. ఏడాదిన్నరగా అక్కడ పనిచేస్తున్నారు. సంస్థ యాజమాన్యం మన్నలు పొందారు. ఆ ఏడాది జీతం పెంపుతో పాటు బోనస్ కూడా దక్కించుకున్నారు. ఇటీవల ఉన్నట్టుండి సంస్థ యాజమాన్యం ఆయనకు లేఆఫ్ ఇచ్చేసింది. ఖర్చులు తగ్గించుకునేందుకు వైస్ప్రెసిడెంట్ పదవినే తీసేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. కార్పొరేట్ ప్రపంచం ఇంతే కదా అనుకుని ఆయన సరిపెట్టుకున్నారు. కానీ ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకుని నివ్వెరపోవడం ఆయన వంతైంది. ఈ ఉదంతానికి సంబంధించి పూర్తి వివరాలతో ఆయన పెట్టిన పోస్టు ప్రస్తుతం సంచలనం రేపుతోంది.
ఈ బుధవారం కంపెనీ వారు నన్ను సాగనంపారు. అక్కడ ఏడాదిన్నరగా నేను వీపీ పదవిలో పనిచేస్తున్నాను. నా పనితీరుపై ఒక్కసారిగా కూడా నెగెటివ్ ఫీడ్బ్యాక్ రాలేదు. మార్చిలో సమీక్ష సందర్భంగా నాకు జీతం భారీగానే పెంచారు. అదనంగా 25 శాతం బోనస్ కూడా ఇచ్చారు. తొలగింపునకు వారం ముందు సంస్థ సీఓఓ, సీఈఓ నాతో మాట్లాడారు. పొదుపు చర్యల్లో భాగంగా నన్ను తొలగిస్తున్నామని, ఇందులో వ్యక్తిగతం ఏమీ లేదని అన్నారు. తొలగింపునకు పరిహారంగా 10 వారాల జీతం కూడా ఇచ్చారు.
సడెన్గా జాబ్ పోవడంతో మొదట నేను షాకైపోయా. తరువాత నాకు నేను సర్దిచెప్పుకున్నా. కానీ ఈ రోజు నేను లింక్డ్ఇన్లో చూస్తే సంస్థ వీపీగా మరో వ్యక్తిని నియమించుకున్నట్టు చూసి దిగ్భ్రాంతికి లోనయ్యా. ఆ దెబ్బకు గుండె జారిపోయింది. నేను ఏ రోజూ వాళ్లిచ్చిన టార్గెట్ మిస్ కాలేదు. చెప్పిన సమయంలోనే పని పూర్తి చేసేవాణ్ణి. నమ్మకంగా ఉన్నా. వారాంతాల్లో కూడా పనిచేశా. ఏ సమయంలోనైనా అందుబాటులో ఉండేవాణ్ణి. కానీ అసలు విషయం తెలిశాక నాకు చాలా కోపం వచ్చింది. వాస్తవాన్ని నాకు నేరుగా చెబితే బాగుండేదిగా.. అని వాపోయారు.
ఈ పోస్టుకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది ఆయన పరిస్థితికి విచారం వ్యక్తం చేశారు. తమ సహోద్యోగుల్లో కొందరికి ఇదే పరిస్థితి ఎదురైందని అన్నారు. కార్పొరేట్ ప్రపంచం అంటే ఇదే అని కొందరు నిట్టూర్చారు. ఆయన కంటే తక్కువ జీతానికి మరో వ్యక్తి వచ్చి ఉండొచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. ఇదేమీ వ్యక్తిగత అంశం కాదని కొందరు భరోసా ఇచ్చారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం వైరల్గా మారింది. జనాలు నివ్వెరపోయేలా చేస్తోంది.