Off Beat

దోపిడీ దొంగ‌ల నుంచి తెలివిగా త‌ప్పించుకున్న ప‌శువుల వ్యాపారి..

సీతారామాపురం అనే గ్రామంలో సత్యం అనే పశువుల వ్యాపారి నివసించే వాడు. ఊరిలో సత్యమంటే అందరికీ నమ్మకం. పశువుల‌ గురించి సత్యంకు మంచి అవగాహన ఉంది. ఊరిలో ఎవరు పశువులు కొనాలన్నా, అమ్మాలన్నా సత్యంను ఆశ్రయించేవారు. ప్రతిఫలంగా అతనికి కొంత ధనం ఇచ్చేవారు. ఒకసారి ఆ ఊర్లో మోతుబ‌రి రైతు ధర్మయ్య కూతురికి పెళ్లి నిశ్చయం అయ్యింది. సమయానికి డబ్బులు అందక పోవడంతో ధర్మయ్య తన దగ్గరున్న పాడి గేదెలను అమ్మాలనుకున్నాడు. సత్యాన్ని సాయం కోరాడు. ఆ పాడి గేదెలను సత్యం సంతకు తోలుకెళ్లాడు.

పదిహేను గేదెలు అమ్ముడయ్యాయి. పెద్దమొత్తంలో సొమ్ము చేతికి వచ్చింది. ఇంతలోనే చీకటి పడింది. వీలైనన్ని గేదెలను అమ్మాలన్న ధ్యాసలో ఉన్న సత్యం చీకటిపడుతున్న విషయం గమనించలేదు. చీకటి పడితే అచ్యుతాపురంలో దొంగల బెడద ఎక్కువ. ఎలాగైనా గేదెలు అమ్మిన డబ్బులు ధర్మయ్యకి భద్రంగా చేర్చాలని సత్యం ఓ ఉపాయం ఆలోచించాడు. దారి మధ్యలో కొంతమంది బందిపోట్లు సత్యంను అడ్డుకున్నారు. డబ్బులు ఇవ్వమని బెదిరించారు. తన దగ్గర దమ్మిడి లేదని కావాలంటే వెతుక్కొమ్మని సత్యం వాళ్లతో గట్టిగా అన్నాడు. బందిపోట్లు ఎంత వెదికినా సత్యం దగ్గర సొమ్ములు దొరకలేదు. వెళ్లిపొమ్మని వదిలేశారు.

cattle merchant escaped easily from thieves

ధర్మయ్య ఇంటికి చేరుకున్న సత్యం, అమ్ముడైన పదిహేను గేదెల సొమ్ముని అతనికి అప్పజెప్పాడు. దారిలో బందిపోట్లు అడ్డగించిన విషయం కూడా చెప్పాడు. అంతా విన్న ధర్మయ్య బందిపోట్ల కళ్ళు ఎలా కప్పావు సత్యం? అని అడిగాడు. దారిలో ఇలాంటి ఆపద వస్తుందని ముందుగా నా దగ్గరున్న సొమ్ము ఐదు భాగాలు చేసి ఐదు గేదెల మెడల్లో ఉన్న గంటల్లో కట్టాను. అలా మీ డబ్బు సురక్షితంగా మీకు చేర్చాను అని సత్యం తాను చేసిన పని గురించి చెప్పాడు. సత్యం తెలితేటలను మెచ్చుకున్న ధర్మయ్య అధిక మొత్తం ముట్టచెప్పాడు.

Admin

Recent Posts