ప్రతిరోజూ తీసుకునే ఆహార పదార్ధాలలో షుగర్ అధికంగా వుంటే శరీరం లావెక్కుతుందని, తద్వారా గుండె సంబంధిత వ్యాధులు మరింత పెరిగే అవకాశం వుందని ఎమోరీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన డాక్టర్ మియమ్ వోస్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ కు చెందిన జర్నల్ లో రాసిన తన పరిశోధనా పేపర్లలో పేర్కొన్నారు. స్వీట్ ఎక్కువగానున్న ఆహారాలు, పానీయాలలో కలిపే షుగర్ కారణంగా అందులో కేలరీలు ఎక్కువగా వుంటాయని, వాటిని ఎక్కువగా తీసుకునే వారిలో అధిక బరువుతోపాటు అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వీరు తెలిపారు.
ఈ నేపధ్యంలో, అధికంగా చక్కెరను తీసుకునేవారిలో ఊబకాయ సమస్యతోపాటు మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత జబ్బులు, గుండెపోటు తదితర జబ్బులు వచ్చే అవకాశాలున్నాయని, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ హెచ్చరించినట్లుగా కూడా వీరు తెలిపారు. ప్రధానంగా మహిళలు రోజుకు వంద కేలరీలకు మించకుండా ఉండేలా షుగర్ను తీసుకోవాలని లేదా ఆరు టీస్పూన్ల చక్కెరను మాత్రమే అంటే షుమారు 25 గ్రాములు మాత్రమే షుగర్ ను తీసుకోవాలని వీరు తెలుపుతున్నారు. ఇదే విధంగా, పురుషులు రోజుకు 150 కెలోరీలకు మించకుండా ఉండేలా చక్కెరను తీసుకోవాలి. లేదా తొమ్మిది టీస్పూన్ల మేరకు అంటే 37.5 గ్రాముల చక్కెరను మాత్రమే తీసుకోవాలని వీరు సూచించారు.
ఒకవేళ ఈ మోతాదుకుమించి చక్కెరను తీసుకున్నా లేదా తీపి పదార్థాలు తీసుకున్నా వీలైనంత మేరకు…. అధిక నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. నీటిని అధికంగా తాగడం వలన శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలు బయటకు విసర్జించబడతాయని పరిశోధకులు తెలుపుతున్నారు. కూల్ డ్రింక్ ల వంటివి తీసుకోవడంతో శరీర రక్తంలో షుగర్ నిల్వలు పెరగడంతో శరీరంలో కొవ్వు శాతం అధికంగా పేరుకుపోతోందని, తాము పరిశోధించిన దాదాపు ఆరువేలమందిలో 20 శాతం మేర వ్యక్తులలో చక్కెర అధికంగా తీసుకోవడం వలననే వారిలో అధిక కెలొరీలు పెరిగినట్లు తాము గుర్తించినట్లు పరిశోధకులు తెలుపుతున్నారు.