సాధారణంగా చాలా మంది ఉదయం నిద్ర లేస్తూనే రక రకాల అలవాట్లను పాటిస్తుంటారు. ప్రస్తుత తరుణంలో చాలా మంది ఉదయం నిద్ర ఆలస్యంగా లేస్తున్నారు. ఇది సహజంగానే చేసే పొరపాట్లలో ఒకటి. అయితే ఉదయం నిద్ర లేవగానే ఇంకా ఏమేం పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలా మంది బెడ్ మీద ఉండే కాఫీ, టీ లను తాగుతుంటారు. ఇలా అస్సలు చేయరాదు. పరగడుపునే నీళ్లను తాగాలి. లేదా గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగాలి. అంతేకానీ కాఫీ, టీలను తాగరాదు. వాటిని తాగితే జీర్ణవ్యవస్థపై ఉదయాన్నే భారం పడుతుంది. అసిడిటీ పెరుగుతుంది. అందుకు బదులుగా నీళ్లను 1 లీటర్ వరకు తాగాలి. లేదా గోరు వెచ్చని నీళ్లలో నిమ్మరసం పిండి తాగాలి. దీంతో శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. అలాగే మలబద్దకం సమస్య తగ్గుతుంది.
2. ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలా మంది ఫోన్లను చెక్ చేస్తారు. దీంతో మనస్సు డిస్టర్బ్ అవుతుంది. ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. పని గురించి, ఆ రోజు చేయాల్సిన పనుల గురించి విషయాలు గుర్తుకు వస్తాయి. దీంతో ఉదయం నుంచే ఆందోళన చెందడం ప్రారంభిస్తారు. కనుక నిద్ర లేస్తూనే ఫోన్ చెక్ చేయరాదు.
3. ఉదయం నిద్ర లేవగానే కొందరు నేరుగా పనులు చేసుకుంటారు. అలా కాకుండా నిద్ర లేచిన వెంటనే చేతులు, కాళ్లను కదిలిస్తూ ముందుగా వార్మప్ చేయాలి. దీంతో శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఉత్సాహంగా మారుతారు. నిద్ర మత్తు వదులుతుంది. యాక్టివ్గా ఉంటారు.
4. ఉదయం నిద్ర లేచాక హడావిడిగా పనులు చేసి సమయం లేదని చెప్పి ఆఫీస్లకు, కాలేజీలకు వెళ్తుంటారు. అలా కాకుండా నిద్ర లేచాక కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేసే ఏర్పాటు చేసుకోవాలి. లేదా కనీసం 15 నిమిషాల పాటు యోగా అయినా చేయాలి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.
5. ఉదయం చాలా మంది ఆహారం తీసుకోవడం మానేస్తారు. ఉదయం చేసే పొరపాట్లలో ఇది కూడా ఒకటి. బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల రోజులో మిగిలిన సమయాల్లో ఎక్కువగా ఆహారం తింటారని సైంటిస్టుల అధ్యయనాల్లో వెల్లడైంది. దీంతో బరువు పెరుగుతారు. కనుక ఉదయం కచ్చితంగా బ్రేక్ఫాస్ట్ చేయాలి. మానేయరాదు.