సినిమాల్లో చాలా మంది బాల నటులుగా కెరీర్ ప్రారంభిస్తారు కానీ చివరి వరకు ఆ ప్రస్థానాన్ని కొనసాగించగలిగింది మాత్రం కేవలం శ్రీదేవి మాత్రమే.. బూచాడమ్మ బూచాడు అంటూ పాడిన చిట్టి శ్రీదేవి.. ఆకుచాటు పిందె తడిసే అంటూ ఆడిపాడిన వయ్యారాల శ్రీదేవి..ప్రౌఢ వయసులోకి వచ్చాక కూడా జామురాతరి జాబిలమ్మ అంటూ పాడితే కళ్లతోనే ఎన్నో ఊసులు చెప్పిన శ్రీదేవి… కొన్నేండ్ల గ్యాప్ తర్వాత ఇంగ్లీష్ రాని అమ్మగా కనపడినా. .అంతా శ్రీదేవికే చెల్లింది.. అటువంటి శ్రీదేవి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.. 1963, ఆగస్ట్ 13, మంగళవారం నాడు మద్రాసులోని శివకాశీలో పుట్టిన అమ్మాయి శ్రీ అమ్మ అయంగర్ ( శ్రీదేవి). నాలుగేళ్ల వయసులోనే తమ చిన్నాన్నతో ఒక ఫంక్షన్ కి అనుకోకుండా వెళ్లాల్సి రావడం అక్కడ ఒక కన్నడ కవి చిన్నారి శ్రీదేవిని చూసి ముచ్చటపడి “మీ పాపకి సినిమాలో అవకాశం ఇస్తాను” అని శ్రీదేవి తండ్రికి చెప్పడం.. వృత్తిరీత్యా అడ్వకేట్ అయిన శ్రీదేవి తండ్రి ముందు వద్దనుకొన్నా.. తల్లి మాత్రం శ్రీదేవిని ఎంకరేజ్ చేయడంతో మొట్టమొదటిసారి నాలుగేళ్ల ప్రాయంలో చిన్నారి అయ్యప్పస్వామిగా “తునైవాన్” (1967) లో వెండితెరపై మెరిసింది శ్రీదేవి.
ఒక సినిమా షూటింగ్ సమయంలో ఎమ్.జి.రామచంద్రన్ శ్రీదేవిని చూసి “నమ్ నాడు” అనే చిత్రంలో నటింపజేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చాయి. పదేళ్ళ వయసులోనే శ్రీదేవి రోజుకి మూడు షిఫ్టుల్లో వర్క్ చేసేది అంటే అప్పట్లో ఆమె పరిస్థితి ఏంటో అర్దం చేసుకోవచ్చు. వరుస షూటింగ్ లతో స్కూల్ కి వెళ్లి చదువుకునే అవకాశంలేకపోయింది శ్రీదేవికి.. దాంతో షూటింగ్ గ్యాప్లో చదువుకునేది. శ్రీదేవి తండ్రి ఆమె కెరీర్ పట్ల కంటే ఆమె వ్యక్తిగత జీవితం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకొనేవారు. ఆమె నటిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. చదువు పక్కనేట్టకూడదని ఆమె కోసం సెట్ లో ఒక ట్యూటర్ ని ఏర్పాటు చేశారు.
శ్రీదేవిపై ఆమె తల్లి ఇన్ఫ్ల్యూయెన్స్ చాలా ఉంటుందని చెప్పొచ్చు. చిన్నప్పట్నుంచి తల్లంటే ఎంతటి అభిమానం అంటే తల్లి మాటని వేదంలా భావించేది.. ఒకసారి శ్రీదేవి తల్లి ఆమెను ఓ గోడపై కూర్చోబెట్టి “ఇక్కడే కూర్చో” అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి.. ఇంటి పనిలో నిమగ్నమైపోయింది. నాలుగైదు గంటల తర్వాత ఇంట్లో శ్రీదేవి కనిపించకపోయేసరికి ఇల్లంతా వెతికి చూస్తే.. అలా గోడ మీద బిక్కు బిక్కు మంటూ కూర్చున్న శ్రీదేవిని చూసి నిర్ఘాంతపోయిందట. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోల సరసన.. బాలచందర్, భారతీరాజా వంటి స్టార్ డైరెక్టర్ల నేతృత్వంలో నటించారు శ్రీదేవి. పద్నాలుగేళ్ల ప్రాయంలోనే 20 ఏళ్ల అమ్మాయిగా నటించింది. సినిమాలో ఆమెను చూసిన ప్రేక్షకులు “ఈ అమ్మాయి వయసు 14/15 ఏళ్ళా ??” అని షాక్ అయ్యేవారు. అంతేకాదు రజనీకాంత్ కి సవతి తల్లిగా కూడా నటించింది.
“నా తమ్ముడు” షూటింగ్ టైమ్ లో మౌంట్ రోడ్డు క్రాస్ చేసే షాట్ లో శ్రీదేవి నిజంగానే కార్ ను ఢీకొంది. అప్పుడు రాఘవేంద్రరావు శ్రీదేవిని తన స్వహస్తాలతో ఎత్తుకొని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అప్పుడు శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్టు. ఆ తర్వాత ఆమెను “పదహారేళ్ళ వయసు” సినిమాలో కథానాయికగా ఎంపిక చేసుకొన్నారు.. అప్పటికి శ్రీదేవి వయసు పద్నాలుగేళ్లే… శ్రీదేవితో అత్యధిక సినిమాలు చేసిన దర్శకుడు కూడా రాఘవేంద్రరావే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 24 చిత్రాల్లో కలిసి నటించిన శ్రీదేవికి ఆయన దర్శకత్వంలో 25వ సినిమాలో నటించి వారిద్దరి కాంబినేషన్ లో సిల్వర్ జూబ్లీ సినిమా రావాలని ఆశపడింది.
“పదహారేళ్ళ వయసు” సినిమాని మొదట భారతీరాజా తమిళంలో తెరకెక్కించారు. కమల్ హాసన్ హీరోగా నటించగా.. విలన్ గా రజనీకాంత్ ముఖ్యపాత్ర పోషించిన సినిమా అది. ఆ సినిమాకి తమిళ ప్రేక్షకుల మనోభావాలకి తగ్గట్లుగా శాడ్ ఎండింగ్ ఇచ్చారు భారతీరాజా. శాడ్ ఎండింగ్స్ ని తమిళ ప్రేక్షకులు స్వాగతించినట్టుగా తెలుగు వారు ఆస్వాదించలేరు.. అందుకే.. ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసిన రాఘవేంద్రరావు క్లైమాక్స్ ను మార్చారు. తమిళ్లో కమల్ హాసన్-శ్రీదేవి చివరికి కలవరు. కానీ.. తెలుగులో శ్రీదేవి-చంద్రమోహన్ కలుసుకొంటారు… శ్రీదేవిని అందరూ అప్పట్లో రొమాంటిక్ హీరోయిన్ అని పిలుచుకొనేవారు .ఇప్పుడు కూడా శ్రీదేవి అందరికి శృంగార దేవతే..కాకపోతే వాస్తవం ఏంటంటే ఆమెకు రోమాంటిక్ ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం రాదట. బాలచందర్ సినిమాలో నటిస్తున్న టైమ్ లో శ్రీదేవి రొమాంటిక్ ఎక్స్ ప్రెషన్ ఇవ్వలేదన్న కోపంతో షూటింగ్ ప్యాకప్ చెప్పేసారట.
తర్వాత శ్రీదేవి ఇంటికెళ్ళి “అమ్మాయికి కాస్త రొమాంటిక్ మూవీస్ చూపించండి” అని చెప్పారట. ఎన్ని సినిమాలు చూసినా శ్రీదేవి కెమెరా ముందు రొమాంటిక్ ఎక్స్ ప్రెషన్ ఇవ్వలేకపోవడంతో..“నువ్వు కెమెరా ముందు కాస్త ఏడుస్తున్నట్లు కనిపించు చాలు” అన్నారట. ఆ తర్వాత నుంచి రోమాంటిక్ సీన్స్ లో నటించాల్సి వచ్చినప్పుడల్లా శ్రీదేవి అదే ఫాలో అయ్యేదట.. సీనియర్ ఎన్టీయార్ తో కలిసి “బడిపంతులు” (1972) అనే చిత్రంలో మానవరాలిగా నటించిన శ్రీదేవి తర్వాత “వేటగాడు” (1979)లో కథానాయికగా నటించింది. శ్రీదేవి ఈ సినిమాలో హీరోయిన్ అని, తన వయసు పద్నాలుగేండ్లని రాఘవేంద్రరావు చెప్పినప్పుడు ఎన్టీయార్ “దాందేముంది తన వయసు పద్నాలుగేళ్లయితే, నా వయసు పద్నాలుగేళ్లే కదా బ్రదర్?” అన్నారట. మనవరాలి వయసు పిల్లతో సినిమాలేంటి అని ముందు పెదవి విరిచిన వారే వేటగాడు సినిమాలో ఆ ఇద్దరి కాంభినేషన్ కి జనాలు వెర్రెత్తిపోవడంతో ముక్కున వేలేసుకున్నారట. వేటగాడు తర్వత ఎన్టీయార్ తో కలిసి 12 సినిమాల్లో నటించింది శ్రీదేవి.
1973లో వచ్చిన “భక్త తుకారాం” అనే చిత్రంలో శ్రీదేవి టైటిల్ పాత్రధారి ఏయన్నార్ కి కూతురిగా నటించింది. ఆ తర్వాత 1981లో “ప్రేమాభిషేకం” చిత్రంలో కథానాయికగా నటించింది. ఏయన్నార్ కాంబినేషన్ లోనూ 10 సినిమాల్లో నటించింది శ్రీదేవి. చిరంజీవి సరసన “రాణికాసుల రంగమ్మ, జగదేకవీరుడు అతిలోక సుందరి, ఎస్.పి.పరశురామ్” చిత్రాల్లో శ్రీదేవి కథానాయికగా నటించిన విషయమే అందరికీ తెలుసు. కానీ.. చిరంజీవి విలన్ గా నటించిన రెండు సినిమాల్లోనూ శ్రీదేవి హీరోయిన్ గా నటించింది. “మోసగాడు” (1980), “రనువ వీరన్” (1981) చిత్రాల్లో చిరంజీవి విలన్ గా నటించారు. శ్రీదేవి బాలీవుడ్ లో సెటిల్ అయ్యాక తన చెల్లెలు శ్రీలతను నిర్మాతగా పెట్టి చిరంజీవి హీరోగా “వజ్రాల దొంగ” చిత్రాన్ని మొదలెట్టారు. భారీ బడ్జెట్ తో తీదామనుకొన్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ తోనే కారణాంతరాలవలన ఆగిపోయింది.
నాగార్జున సరసన “ఆఖరి పోరాటం, గోవిందా గోవిందా” చిత్రాల్లో నటించింది శ్రీదేవి. తండ్రి ఎఎన్నార్, తనయుడు నాగార్జునతో నటించిన క్రెడిట్ శ్రీదేవికి మాత్రమే ఉంటుంది. వెంకటేష్ తో కలిసి ఒకే ఒక్క చిత్రంలో నటించింది. అదే “క్షణ క్షణం”. వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్. అయితే.. పేరుకి ఈ సినిమాలో హీరో వెంకటేష్ అయినా.. కథ మొత్తం శ్రీదేవి చుట్టూనే తిరగడం వలన ఒకానొక సందర్భంలో ఈ సినిమాలో హీరో శ్రీదేవి, నేను జస్ట్ పక్కన నటించాను అని వెంకటేష్ కూడా పేర్కొనడం విశేషం. “లమ్హే” షూటింగ్ టైమ్ లో తండ్రి చనిపోయాడన్న వార్త తెలిసింది. అయితే.. వెంటనే బయలుదేరకుండా నిర్మాతకి నష్టం రాకూడదే ఉద్దేశ్యంతో ఆరోజు షూటింగ్ పూర్తి చేసుకొని మద్రాసు వెళ్ళి.. తండ్రి అంత్యక్రియల కార్యక్రమాలను పూర్తి చేసి, మళ్ళీ షూటింగ్ లో పాల్గొని అనుపమ్ ఖేర్ తో ఒక కామెడీ సీన్ లో యాక్ట్ చేసిన శ్రీదేవిని చూసి యూనిట్ సభ్యులందరూ నివ్వెరపోయారు.
తొలి చూపులోనే శ్రీదేవిని ప్రేమించారట బోణి కపూర్. అయితే.. ఎన్నడూ ఆమెకు చెప్పలేదు. శ్రీదేవి తల్లి అనారోగ్యంతో బాధపడుతున్న టైమ్ లో ఆమె వెన్నంటి ఉన్నది బోణీకపూర్ మాత్రమే. శ్రీదేవి నైరాశ్యంతో బాధపడుతున్న తరుణంలో బోణీ పంచన చేర్చుకొని పెళ్లి చేసుకొంటానని అడగగా.. అప్పటికే ఆయన మంచితనం గురించి తెలిసిన శ్రీదేవి వెంటనే ఒకే చెప్పేసింది. పెళ్లి తర్వాత సినిమాలకు స్వస్తిపలికి కుటుంబానికి అంకితమైపోయింది. చిత్రపరిశ్రమలో శ్రీదేవికి ఎంతో మంది అభిమానులు ఉండొచ్చు. కానీ రాంగోపాల్ వర్మ శ్రీదేవి మీద పెంచుకొన్న అభిమానం ముందు ఎవ్వరూ నిలువలేరు. అసలు వర్మ ఇండస్ట్రీకి వచ్చిందే శ్రీదేవిని దగ్గర నుంచి చూడొచ్చని అట. కేవలం శ్రీదేవి దృష్టిలో పెట్టుకొనే “క్షణక్షణం” కథ రాసుకొన్నాడు ఆర్జీవి. ఆ సినిమాలో శ్రీదేవి ఒక పాట పాడడం విశేషం.