అతి మూత్రవ్యాధి ఉన్నవారు రాత్రి నిద్ర పోయే ముందు ఒక చెంచా తేనె పుచ్చుకుంటే మాటి మాటికి మూత్రానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఆరు నెలలు పూటకు రెండు ఔన్సుల చొప్పున తేనె పుచ్చుకుంటే గుండెకు మేలు చేస్తుంది. ఎదిగే పిల్లకు పోషకాహారంగా తేనె ఎంతో ఉపకరిస్తుంది. ఒక చెంచా తేనె, ఒక నిమ్మకాయరసం, అరగ్లాసు నీటీలో కలిపి తీసుకుంటే వడదెబ్బను నివారించవచ్చు. క్రీడాకారులు ఆటల్లో పాల్గొనబోయే ముందు తేనె, నిమ్మరసం సమపాళ్ళలో తీసుకుంటే ఉత్సాహం, ఉత్తేజం కలిగి త్వరగా అలసట కలుగదు. ఆటలు ఆడిన తర్వాత తీసుకుంటే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. తేనె పుచ్చుకుంటే కళ్ళకు చలువ చేసి దృష్టి మెరుగుపడేలా చేస్తుంది. తేనె, నిమ్మరసం సమభాగాలుగా తీసుకుంటూ ఉంటే గొంతునొప్పి, గొంతు గరగర, గొంతు బొంగురుపోయినట్లుండటం వంటి బాధలు తగ్గుతాయి.
తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలను గర్భిణీలు రోజూ ఉదయం, సాయంత్రం ఒకటి లేదా రెండు తింటే పుట్టబోయే బిడ్డకు బలవర్ధకం. తేనెలో కొద్దిగా ఆముదం చేరిస్తే మంచి విరేచనకారిగా పనిచేస్తుంది. పంచదారకు బదులుగా తేనెను వాడటం వల్ల ఆరోగ్యదాయకంగా పనిచేస్తుంది. ప్రకృతిలో సహజసిద్దంగా లభించే ఆహారపదార్ధాలలో తేనె ఉత్తమమైనది, పుష్టికరమైనది. భోజనానంతరం తీసుకుంటే పైత్యహారిగా పనిచేస్తుంది. శరీరంలోని అధిక వేడిని తొలగిస్తుంది. మనం తీసుకొనే ఆహారపదార్ధాలు, పానీయాలు మొదలైనవి జీర్ణక్రియలో భాగంగా గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్లుగా మారిన తరువాత క్రమంగా జీర్ణం అవుతాయి. కానీ తేనె ఇలా ఏ మార్పులూ లేకుండా సులభంగా జీర్ణం అవుతుంది.
రెండు తులాల తేనెలో ఒక నిమ్మకాయ రసం కలుపుకొని రోజూ తాగితే పులితేపులు తగ్గుతాయి. రెండు గ్లాసుల నీటిలో నాలుగు టేబుల్ స్పూన్ల తేనె కలిపి తాగాలి. ఇది డయేరియా తగ్గడానికి సులభమైన మార్గం. అజీర్తితో బాధ పడుతుంటే మూడు వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా నూరి పాల లో కలుపుకుని తాగితే వెంటనే రిలీఫ్ వస్తుంది. కొత్తీమీర రసాన్ని మజ్జిగలో కలుపుకొని తాగితే అజీర్తి బాధ నుండి ఉపశమనం లభిస్తుంది. గ్లాసుడు నీళ్ళలో టీ స్పున్ అల్లరసం, టీ స్పూన్ నిమ్మరసం కలిపి తాగితే అజీర్తి బాధ వెంటనే తగ్గుముఖం పడుతుంది. నిద్రలేమితో బాధపడుతున్నవారు కొన్ని కొత్తిమీర ఆకుల్ని మెత్తగా నూరి ఆ రసాన్ని వేడి నీళ్ళ లో కలిపి గోరు వెచ్చగా అయ్యాక తాగితే మంచి ఫలితం వుంటుంది. వెల్లుల్లి రెబ్బలను పాలలో మరగబెట్టి తీసుకుంటే ఆస్తమా నుండి ఉపశమనం లభిస్తుంది.