క్రికెట్… ఈ ఆటంటే తెలియని వారులేరు. ప్రధానంగా మన దేశంలో అయితే క్రికెట్ వీరాభిమానులు లెక్క లేనంత మంది ఉన్నారు. ఇక వరల్డ్కప్ లాంటి మ్యాచ్లు జరిగినప్పుడైతే ఆఫీసులకి, స్కూళ్లకు సెలవులు పెట్టి మరీ మ్యాచ్లను ఎంజాయ్ చేసే వారు కూడా కోకొల్లలుగా ఉన్నారు. అయితే ఈ ఆటలో కేవలం ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం కోట్లాదిమంది క్రికెట్ అభిమానులను నిరాశకు గురి చేస్తుంది. అతనే థర్డ్ అంపైర్. అవును, గ్రౌండ్లో ఉన్న అంపైర్లు తమ నిర్ణయాన్ని వెల్లడించడంలో అనుమానంగా ఉంటే థర్డ్ అంపైర్ను ఆశ్రయిస్తారు. ఈ క్రమంలో అసలు థర్డ్ అంపైర్ ఆటను ఎలా వీక్షిస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
ఎల్బీడబ్ల్యూ, రన్ అవుట్ వంటి ఔట్ల విషయంలో, ఫోర్ లేదా సిక్స్ కొట్టినప్పుడు బంతి దాటిందా లేదా అన్నది చూడడం కోసం, వేరే ఇతర సందర్భాల్లో గ్రౌండ్ అంపైర్లు థర్డ్ అంపైర్లకు సూచిస్తారు. ఈ సందర్భంలో వారు బాక్స్లా గీసి థర్డ్ అంపైర్కి ఇస్తారు. దీంతో థర్డ్ అంపైర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే బ్యాట్స్మెన్ అవుట్ అయ్యాడా లేదా అన్నది తెలుసుకునే సందర్భంలో థర్డ్ అంపైర్కి సూచిస్తే అప్పుడు అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు. ఒకప్పుడంటే ఔట్ నిర్ణయాన్ని తెలియజేయాలంటే ఎరుపు, ఆకుపచ్చ లైట్లను వాడేవారు. కానీ ఇప్పుడు మైదానంలో భారీ తెరల ద్వారా నిర్ణయాన్ని వెల్లడిస్తున్నారు.
కాగా రెడ్, గ్రీన్ లైట్ల ద్వారా థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తెలియజేసే టెక్నాలజీని మొట్ట మొదటి సారిగా 1992 నవంబర్లో ఉపయోగించారు. ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఈ తరహా సాంకేతికతను వాడారు. అయితే థర్డ్ అంపైర్ నిర్ణయం వల్ల ఔట్ అయిన మొదటి బ్యాట్స్మెన్గా మన సచిన్ టెండుల్కర్ రికార్డు సృష్టించాడు. కాలానుగుణంగా ఆ సాంకేతికత అనేక మార్పులకు చేర్పులకు లోనైంది. ఈ క్రమంలో రన్ అవుట్లను, బంతి బౌండరీ దాటిందా లేదా అన్న నిర్ణయాలను వెల్లడించడం కోసం కూడా ఈ సాంకేతికతను వాడుతూ వచ్చారు. క్రమంగా క్యాచ్లు సరిగ్గా పట్టారా లేదా అన్నది చూసేందుకు కూడా ఈ టెక్నాలజీని వాడుతూ వచ్చారు. అనంతరం నో బాల్స్ చెకింగ్కు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడింది.
బంతి బ్యాట్ను తాకిందా లేదా చెక్ చేసే స్నికో మీటర్, హాట్స్పాట్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలు కూడా వచ్చాయి. ఎల్బీడబ్ల్యూను నిర్ణయించేందుకు హాక్ ఐ పరిజ్ఞానం కూడా అందుబాటులోకి వచ్చింది. చివరిగా డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) కూడా రంగ ప్రవేశం చేసింది. అయితే దీన్ని ఇరు జట్ల అంగీకారంతోనే ఇప్పుడు వాడుతున్నారు. అయితే ఈ సాంకేతిక పరిజ్ఞానాలన్నింటినీ థర్డ్ అంపైర్ వాడుకునే వాడు. కాగా 1992లో ఉన్నప్పుటి రూమ్ కన్నా ఇప్పుడు థర్డ్ అంపైర్కు మరింత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలు ఉన్న రూమ్ను అందిస్తున్నారు. దీంట్లో థర్డ్ అంపైర్ అన్ని కెమెరాలను, అన్ని కోణాల నుంచి జాగ్రత్తగా పరిశీలించవచ్చు. ఇది సత్వరమైన, కచ్చితమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది.