మెంతికూరలో అతి విలువైన పోషకాలు వుంటాయి. మనదేశంలో మెంతులకంటే కూడా మెంతికూరను అధికంగా ఆహారంలో ఉపయోగిస్తారు. మనం దీనిని ఒక ఔషధంగా కూడా పరిగణిస్తాము. మెంతులను సువాసనా ద్రవ్యంగా పోపుల పెట్టె మసాలా దినుసులలో ఒకటిగా ఉపయోగిస్తాము. ఇక పచ్చటి మెంతి కూర ఆకు ఎంతో రుచికరంగాను ఔషధ విలువలు చేకూర్చేదిగాను వుంటుంది. ఈ ఆకులను ఎండబెట్టి కూడా కొన్ని ఆహార పదార్ధాలలో వాడవచ్చు. ఎండిన ఆకులుసైతం ఎంతో మేలు చేస్తాయి. తాజా మెంతి కూర కొద్దిపాటి చేదు వుంటుంది.
దీనిని కందిపప్పుతో ఉడికించి మెంతికూర పప్పుగా కూడా తయారు చేస్తారు. గోంగూర ఆకు ఉడికించే రీతిలోనే దీనిని కూడా ఉడికించవచ్చు. మెంతి పరోటాలు రుచికరంగా వుంటాయి. మెంతికూరలో అత్యధిక ఐరన్ వుంటుంది. అందుకనే మెంతి కూరను లేదా మెంతులను రక్తహీనత వున్న రోగులకు ఔషధపరంగా అధికంగా వాడతారు. తాజా మెంతికూర ఆకును జ్యూస్ గా తయారు చేసి ఉదయం వేళ తాగితే షుగర్ వ్యాధి వారికవసరమైన ఇన్సులిన్ నియంత్రణగా పనిచేస్తుంది.
ఇది కాకరకాయ రసం వలే చేదుగా వున్నప్పటికి షుగర్ వ్యాధి నియంత్రణకు మంచి ఫలితాలనిస్తుంది. గోంగూర వలే మెంతిలో కూడా విటమిన్ కె అధికంగా వుంటుంది. శరీరానికవసరమైన పీచు పదార్ధాలు కూడా ఇందులో వుంటాయి. కనుక మలబద్ధకం కలవారు మెంతికూర లేదా రసం తీసుకుంటే సమస్య తొలగిపోతుంది. మెంతి లో ప్రొటీన్లు, నికోటినిక్ యాసిడ్ కూడా వుంటాయి. ఇవి వెంట్రుకల చక్కటి ఎదుగుదలకు తోడ్పడతాయి. మెంతిని ఏ రూపంలో వాడినప్పటికి అది ఇచ్చే ప్రయోజనాలు అత్యధికమనే చెప్పాలి.