నాకు కార్గిల్ యుద్ధములో షహీద్ అయిన సైనికుడి మృతదేహాన్ని ఆగ్రా నుండి వారి గ్రామానికి చేర్చాలని అందుకు ముందుగా రూట్ మ్యాప్ తయారు చేయమని ఆదేశాలు అందాయి. ఆ సైనికుడి డాకుమెంట్స్ ద్వారా గ్రామము, తాలూకా, జిల్లా పరిశీలించా! ఆశ్చర్యము అతని పర్సనల్ డాక్యుమెంట్ లో అన్నీ ఒకే వివరాలు ఉన్నాయి. బటాలిన్ ద్వారా ఆ సైనికుడి గ్రామము, అతని దగ్గర గ్రామాల ఉన్న సైనికుల ద్వారా సరైన వివరాలు పొందాను. ఆ రోజుల్లో గూగుల్ మ్యాప్ లేదు, సర్వే మ్యాప్ మిలిటరీ ది మఱియు పెద్ద స్కేల్ ఉన్న పోలీస్ శాఖ వద్ద ఉన్న మ్యాప్ సహాయముతో ఆ సైనికుడి గ్రామాన్ని గుర్తించి ఆగ్రా నుండి వారి గ్రామానికి మిలిటరీ వెహికల్ ఊరేగింపుగా తీసుకువెళ్ళడానికి ప్రణాళికలు సిద్దము చేసాము. మొత్తము మూడు వాహనాలు ఒక దాంట్లో మృతదేహము, రెండవ దాంట్లో మిలిటరీ బ్యాండ్, మూడవ దాంట్లో నివాళులు అర్పించే సైనిక దళం వారి వారి ఆయుధాలతో.
మీకు తెలుసా దేశ రక్షణలో పాలుపంచుకొంటున్న సైనికుల కు యుద్దములో పాలుపంచుకోని సైనిక బృందాలు వెనుకనుండి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాయి. అలాంటి బాధ్యతే మా బటాలిన్ నిర్వహించింది, అప్పటికే మా సైనికులు సుమారు ఒక కంపెనీ (మొదటి బ్యాచ్ ) బటాలిక్ క్షేత్రములో పాకిస్థాను తో యుద్ధములో వ్యస్తులైనారు, సెకండ్ టీం లో నేనున్నాను. యుద్ధ క్షేత్రము చేరేవరకు ఎవరి పనులు లేదా బెటాలియన్ ఆదేశించిన పనులు చేయవల్సినదే! యుద్ధ వాతావరణములో సైనికులకు సెలవులుండవు, కొన్ని మినహాయింపులు ఉంటాయి. జాట్ రెజిమెంట్ నుండి శెలవకు వచ్చిన కర్తార్ సింగ్ ను వెతుకుతూ సివిల్ పోలీస్ వచ్చింది. సిపోయ్ కర్తార్ సింగ్ తన తల్లి మరణించింది అని టెలిగ్రామ్ తెప్పించుకొని ఇంటికి వచ్చాడు. ఎంత కార్గిల్ యుద్ధ మైనా ఇలాంటి ఆకస్మిక సంఘటనలకు సెలవు ఇస్తారు.
సెలవు ముగిసాక 15-30 రోజులు కమాండింగ్ ఆఫీసర్ సెలవకు వెళ్ళిన సైనికుల తో సంపర్కానికి అన్ని విధాల కృషి చేస్తారు, ఆఖరి అస్త్రముగా పోలీస్ శాఖకు సమాచారం ఇస్తారు. పోలీస్ వారు సైనికుడిని తమ కస్టడీ లో తీసుకొని బటాలిన్ కి సూచన ఇస్తారు. మిలిటరీ పోలీస్ కూడా ఈ విషయములో సివిల్ పోలీస్ కి సహకరిస్తుంది. ఈ రోజుల్లో ఉద్యోగము దొరకడమే దుర్లభము, ఎవరూ మిలిటరీ వదిలి పారిపోవట్లేదు. అదుపులో తీసుకున్న సైనికుడిని విచారణ చేసి తగిన శిక్ష వేసి బటాలిన్ లో చేర్చు కుంటారు. ఒకవేళ సైనికుడిదే దోషమని తేలితే మిలిటరీ నుండి కోర్ట్ మార్షల్ చేసి పంపుతారు. వీరికి మాజీ సైనికుడి గుర్తింపు, పెన్షన్ కూడా లభించదు. ఉద్యోగావశాకాలు లభించవు. అసలు విషయానికి వస్తే సిపాయి కర్తార్ సింగ్ తల్లి మరణించిందని సెలవకు వచ్చాడు, కార్గిల్ యుద్దములో తన పటాలం లో ఎక్కువ క్యాజువాలిటీస్ చూసి బెంబేలెత్తి పోయాడు.
దొంగ టెలిగ్రామ్ తెప్పించుకున్నాడు, కమాండింగ్ ఆఫీసర్ మానవతా దృక్పధముతో సెలవు అది కొన్ని రోజులుమాత్రమే ఇచ్చాడు తల్లి కాబట్టి. సిపాయి కర్తార్ సింగ్ కమాండింగ్ ఆఫీసర్ విశ్వాసానికి విఘాతము కలిగించాడు. పోలీస్ సిపాయి కర్తార్ సింగ్ ఇంటికి అరెస్ట్ వారంట్ తో చేరింది, కర్తార్ సింగ్ తండ్రి తన కుమారుడు లేడని అబద్ధం చెప్పాడు. పోలీస్ వారు ఇల్లంతా పరిశీలనా చేసి సిపాయి కర్తార్ సింగ్ లేడని ద్రువీకరించి నివేదిక బటాలిన్ కు పంపారు. యదార్ధానికి సిపాయి కర్తార్ సింగ్ పిడకలు, ఎండు గడ్డి, పశు గ్రాసాలు నిల్వవుండే గోదాములో దాక్కొని పోలీసులనుండి తప్పించుకున్నాడు. కానీ విధిని తప్పించుకోలేడుగా! ఆ గోదాములోనే తిష్ట వేసుకొన్న నల్ల మిన్నాగు బలముగా కాటు వేయడముతో నురగలు కక్కుకొంటూ చనిపోయాడు. పాపము సిపాయి కర్తార్ సింగ్ కు రావాల్సిన సర్కారీ ప్రయోజనాలు హుళక్కి అయిపోయాయి, యుద్ధ సమయములో దేశాన్ని రక్షించడము మాని తన స్వార్థము చూసుకొన్నాడన్న అపఖ్యాతి ఆ కుటుంబానికి మిగిలింది.
ఆ బెటాలియన్ కూడా సిపాయి కర్తార్ సింగ్ ని మరణించి తరువాత కోర్టమార్షల్ చేసి అతని కి రావలసిన జీతభత్యాలు కుటుంబ సభ్యులకు అందజేసారు. అదే బటాలిన్ కు చెందిన సిపాయి దూబే ఉండేవాడు, ఓవర్ వెయిట్ కానీ శారీరక పరీక్షలలో సరయిన ఫలితాలు చూపేవాడు. ముగ్గురు పిల్లలు, కమాండింగ్ ఆఫీసర్ దూబే క్రమశిక్షణను దృష్టిలో పెట్టుకొని తగిన బటాలియన్ భాద్యతలు అప్పచెప్పేవారు. ఈ సిపాయి దూబే కూడా కార్గిల్ యుద్దములో పాలుగొన్నాడు. ఆదేశాలను అతిక్రమించి తన ట్రెంచ్ నుండి బయిటకు తన శరీరాన్ని ఎక్సపోజ్ చేయడముతో ఒక స్ప్లింటర్ వలన అయిన గాయముతో తగిన ఫస్ట్ ఎయిడ్ అందే లోగా శరీరము విషపూరితము అయ్యి యుద్ధక్షేత్రములోనే అశువులు బాసాడు. సిపాయి దూబే త్యాగానికి గుర్తు గా అదే సమయములో నేలకూలిన పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని నేల కూర్చడములో బటాలియన్ ఎయిర్ డిఫెన్స్ గన్స్ కి సహకారము అందించినట్లు నివేదిక సమర్పించారు.
ఫలితముగా షహీద్ దూబే కి వీర్ చక్రము, 50 లక్షల పరిహారముతో పాటూ, మొత్తము ఇన్సూరెన్సు డబ్బు, పిల్లలకు ఉచిత విద్య భార్యకు సర్వీస్ నియమాల ప్రకారము పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వము ద్వారా గృహము, భూమి కూడా లభించాయి. మూడు నెలల తర్వాత షహీద్ దూబే భార్య పిల్లలూ చూసాను, అప్పటి దాక ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఆరోగ్యవంతముగా కనిపించారు.