డయాబెటీస్ వ్యాధి వున్న వారు వారి పాదాల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. దెబ్బ తగిలితే త్వరగా తగ్గదు. ఒక్కొకపుడు చివరకు అది కాలు తీసేయటం వరకు కూడా వస్తుంది. వీరికి కాళ్ళకే ఎందుకు సమస్య? రక్తంలోని అధిక గ్లూకోజ్ బాక్టీరియా బాగా పెరిగేలా చేస్తుంది. సాధారణంగా పాదాలు మనం శుభ్రంగా పెట్టుకోము. వాటికి దెబ్బ తగలటం కూడా తేలికే. దెబ్బ తాకినప్పటికి అది వారికి త్వరగా తెలియని పరిస్ధితి కూడా వుంటుంది. మరి డయాబెటిక్ రోగులు పాదాల పట్ల శ్రద్ధ ఎలా పెట్టాలి?
ప్రతిరోజూ పాదాలు పరీక్షించండి. పాదాల అడుగున అద్దం పెట్టి పరీక్షించండి. వేళ్ళమధ్య పరీక్షించండి. మీకు కష్టం అనిపిస్తే మీ కుటుంబ సభ్యులను పరీక్షించమనండి. చర్మం పగిలిన ప్రదేశాలు సోప్, నీరు తో కడిగి యాంటీ బాక్టీరియల్ క్రీము రాసి అవసరమనుకుంటే చిన్న బేండేజ్ వేయండి. ప్రతిరోజూ గోరువెచ్చని నీరు, సోప్లతో పాదాలు కడగండి. నానపెట్టవద్దు. సెన్సేషన్ తగ్గితే చర్మం కాలే ప్రమాదం వుంది. చర్మం పొడిబారితే మాయిశ్చరైజర్ రాయండి. వేళ్ళ మధ్య పొడిగా వుండాలి.
గోళ్ళు కత్తిరించేటపుడు జాగ్రత్తగా వుండండి. అవసరమనుకుంటే క్లినిక్ లలో వాటిని కత్తిరించమనండి. ఇంటిలో సైతం చెప్పులు లేకుండా నడవకండి. కాటన్ సాక్స్, బూట్లు వంటివి పాదాలకు ఒత్తిడి కలిగించకుండా చూసుకోండి. కొత్త చెప్పులు, బూట్లకు మెల్లగా అలవాటు పడండి. ఎక్కువగా నడిచి పాదాలలో రక్తప్రసరణ పెంచండి. వైద్యుని వద్దకు పరీక్షకు వెళ్ళేటపుడు, షూస్, సాక్స్ వంటివి తీసేసి వారిని పరీక్ష చేయమనండి.