తిరుపతి చరిత్ర చాలా పురాతనమైనదే కాకుండా చాలా రహస్యమయిమైనది. తిరుపతి చరిత్ర చాలా వింతగా , ఎన్నో చారిత్రక సత్యాలను తవ్వినకొలదీ దొరుకుతాయి. ఆంధ్రుల చరిత్రకు తిరుపతికి అవినాభావ సంబంధం ఉన్నది. తిరుపతి చరిత్ర ప్రక్కకు పెడితే, ఇంత ధనరాశి కలిగిన విలువైన దేవాలయాన్ని మొఘల్ పాలకులు ఎలా వదిలేశారని ప్రశ్న. అసలు తిరుపతిలో అపారమైన ధనరాశులు ఏ విధంగా చేరాయి.ముఖ్యంగా యాదవరాయలు, విజయనగర రాయలే దేవాలయానికి విలువైన కానుకలు సమర్పించేవారని తెలుస్తుంది. అంతేకాకుండా ఒకప్పుడు తిరుపతి గొప్ప వ్యాపారకేంద్రమని విదేశీ గ్రంధకర్తలవల్ల తెలుస్తున్నది. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల లో పెద్దఎత్తున విశ్వవ్యాపారం జరిగేదట.
ప్రపంచంలో దొరికే అన్నివస్తువులు,అలాగే అన్ని జాతుల ప్రజలను ఆ సమయంలో అక్కడ చూడగలమని విదేశీయులు వ్రాతలవల్ల తెలుస్తుంది. వ్యాపారంలో గడించిన లాభాలలో కొంత ధన,కనక,వస్తువాహన రూపంలో భక్తులు సమర్పించుకొనేవారని తెలుస్తుంది. ప్రభువులయితే బంగారునాణాలు కుప్పపోసి సమర్పించుకునేవారట.గాస్పర్ కొరీయ (1492–1567),కౌట్రే (1611),అబ్రహాం రొగేరియస్(1630–40) వీరు పోర్చుగీస్,డచ్ అధికారులు. వీరి రచనలవల్ల తిరుపతి ధనం,సంపద ఎవరెవరిని ఆకర్షించింది,ఆ విలువైన ధనం,బంగారం,రత్న మాణిక్యాలు ఎవరిదగ్గరికి ఎలా చేరాయో తెలియవస్తుంది. నాటి విజయనగర రాయలు (అరవీటి వేంకటరాయలు)తన అవసరాలకు ఆలయధనం నుండి అప్పు తీసుకునేవాడట.
ఆలయనిర్వాహకుడు ఒక ప్రత్యేక క్రతువు నిర్వహించి దేవుని తరఫుగా అప్పుఇచ్చేవాడట.బహుశా తిరుపతి ఆలయధనం ఆనాడు ఒక బ్యాంక్ గా వాడుకునేవారేమో.బదులుగా ప్రామిసరీ నోటు రాసిఇచ్చేవారట. తిరుమల తిరుపతి సంపదల గూర్చి తెలుసుకున్న పోర్చుగల్ రాజు క్రీ.శ.1543లో ఆలయధనరాశులు కొల్లగొట్టడానికి నౌకలు సైనికబలంతో,ధనరాశులు మోయడానికి గుర్రాలు,బానిసల సమస్త తయారీతో బయలుదేరిన నౌకలు భయంకరమైన సముద్రపు తుఫానులో చిక్కుకోగా మరి పోర్చుగీసువారు తమ ప్రయత్నమే విడిచిపెట్టారు. తిరుమల సంపద ఢిల్లీ దర్బారుకు కూడా చేరింది. మీర్ మహమ్మద్ అమీన్ షాజహాన్ కు తిరుపతి సంపద,విలువైన బహుమతులు అందజేశాడు.వాటిలో అమూల్యమైన పచ్చలు,రత్నాలు పొదిగిన బంగారుపెట్టె ఒకటి.విజయనగర పాలకులు సమర్పించిన నగలు చాలామట్టుకు ము-అజాంఖాన్ తనతో తీసుకువెళ్ళాడు.ఈ విధంగా ఆలయం దోపిడీకి గురికాకుండానే అమూల్యసంపద పరహస్తగతం చేయబడింది. అయితే ఆలయంపై దాడి చేస్తే ఏదైనా కీడు కలుగుతుందేమోనన్న భయంతోనే ఆలయాన్ని విడిచిపెట్టినట్లు మనం ఊహించవచ్చు.